నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో గురు, శుక్రవారాల్లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ను ఎల్ఈడీ స్క్రీన్స్పై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ అధికారి అనంత దత్త గురువారం తెలిపారు. స్థానిక కృషీభవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐపీఎల్ను మరింత మంది అభిమానులకు చేరువ చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నగరాల్లో ఫ్యాన్ పార్స్క్ను నిర్వహిస్తున్నామన్నారు. కాకినాడలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చి మ్యాచ్లను ఆస్వాదించేలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు తలాటం హరీష్ మాట్లాడుతూ క్రికెట్ అభిమానులకు ఫ్యాన్ పార్కు ఒక పెద్ద పండుగ లాంటిదన్నారు. స్టేడియానికి వెళ్లలేని అభిమానులకు తమ నగరంలోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి స్టేడియంలో ఉన్న అనుభూతిని కల్పిస్తుందన్నారు. సంగీత కార్యక్రమాలు, ఫుడ్ స్టాల్స్, చిల్ట్రన్స్ గేమ్స్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
అదనపు కట్నం వేధింపులపై ఫిర్యాదు
ద్వారకాతిరుమల: అదనపు కట్నం కోసం భార్యను చిత్రహింసలకు గురిచేసి, పిల్లలతో సహా ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేసిన భర్త, అత్తమామలపై గురువారం కేసు నమోదు చేసినట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. ఆ వివరాల్లోకి వెళ్తే. మండలంలోని దేవినేనివారిగూడేనికి చెందిన కావేరికి, కృష్ణా జిల్లా బాపులపాడు మండలం, రేమెల్ల గ్రామానికి చెందిన కొనకాల ఉమామహేశ్వరరావుతో సుమారు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. వివాహ సమయంలో కావేరి తల్లిదండ్రులు వరకట్నంగా రూ. 5 లక్షలు, 30 సెంట్ల భూమి, బంగారు ఆభరణాలను ఇచ్చారు. మద్యానికి అలవాటుపడిన భర్త తనను చిత్రహింసలు పెట్టడంతో పాటు, అదనపు కట్నం కోసం అతని తల్లిదండ్రులు కొనకాల సావిత్రి, దుర్గారావులు వేధిస్తున్నారని కావేరి పేర్కొంది. గతేడాది జూన్ 8న తనను కొట్టి, పిల్లలతో పాటు ఇంటి నుంచి బయటకు గెంటేసినట్టు కావేరి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు.


