ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి ఆన్లైన్ సేవలను మనమిత్ర వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. గురువారం ఆలయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం మనమిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇదిలా ఉంటే అర్చకులు, వేద పండితుల బృందం సభ్యులు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయ ఆవరణలో సామూహిక అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి తొలి హారతి, సుప్రభాత సేవ, వేంకటేశ్వర సహిత లక్ష్మీ హోమం జరిపారు. వడగాడ్పుల నేపథ్యంలో ఆలయ ఆవరణలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు.


