అమలాపురం టౌన్: జిల్లాలోని విద్యా సంస్థల బస్సుల్లో విద్యార్థుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో బస్సుల నిర్వహణపై శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో వేసవి సెలవులు ముగిసి విద్యా సంస్థలు పునః ప్రారంభించనున్న క్రమంలో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు విధిగా కలిగి ఉండాలన్నారు. బస్సుల్లో పరిమితికి మించి నిలబడి విద్యార్థులు ప్రయాణించకూడదన్న ఆంక్షలను యాజమాన్యాలు పర్యవేస్తూ ఉండాలన్నారు. ప్రయాణ సమయంలో తమ పిల్లల భద్రత, రక్షణను పర్యవేక్షించడానికి కొన్నిచోట్ల తల్లిదండ్రులు, సంరక్షకులను బస్సుల్లో ప్రయాణించడానికి అనుమతించాలని చెప్పారు. విద్యా సంస్థల బస్సులను విడిచిపెట్టే సమయాల్లో అల్లరి మూకల ఈవ్ టీజింగ్, రేస్ డ్రైవింగ్, ట్రిపుల్ డ్రైవింగ్లపై తమ పోలీస్ శాఖ తక్షణ చర్యలు తీసుకుంటుందని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్, అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, పట్టణ సీఐ పి.వీరబాబు, స్పెషల్ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, సోషల్ మీడియా సీఐ తమ్మినాయుడు పాల్గొన్నారు.


