అల్లవరం: రాత్రంతా కరెంట్ లేక తీవ్ర అవస్థలు పడుతున్నా విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తాడికోన పంచాయతీ పరిధిలోని వీరమ్మ చెరువు గ్రామస్తులు అల్లవరం విద్యుత్ సబ్ స్టేషన్ని శుక్రవారం ముట్టడించారు. మిట్ట మధ్యాహ్నం ఎండను లెక్క చేయకుండా విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట కూర్చొని నిరసన తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి గ్రామంలో కరెంట్ లేకపోతే లైన్మేన్, విద్యుత్ అధికారులు స్పందించలేదని, ఫోన్ చేసినా సమస్య పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా ఎండ తీవ్రతతో చంటి పిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో నరకయాతన అనుభవిస్తున్నా కరెంట్ అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ట్రాన్స్కో ఉన్నత అధికారులు లోఓల్టేటీ సమస్య పరిష్కరించారు.


