అమలాపురం టౌన్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 34 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్పీబీ ప్రసాద్ ఎస్పీ కార్యాలయంలో తమ చాంబర్ల నుంచి గ్రీవెన్స్ను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎస్పీ కార్యాలయానికి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను ఫిర్యాదు రూపంలో ఎస్పీ, ఏఎస్పీలకు అందించారు. అర్జీదారులుతో వారు ముఖాముఖి చర్చింది వారి సమస్యల పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసి పోలీస్ అధికారులతో అక్కడికక్కడే మాట్లాడారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలకు సంబంధించిన ఉండడంతో ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ ఇచ్చి పరిష్కారాలకు సూచనలిచ్చారు.
జాతీయ స్థాయి సెపక్ తక్రా
పోటీలకు కోనసీమ విద్యార్థులు
అమలాపురం రూరల్: ఈ నెల 24 నుంచి 28 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీ వేదికగా 28వ సబ్–జూనియర్ బాల బాలికల జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు జరుగుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జవ్వాది తాత బాబు తెలిపారు. కోనసీమ జిల్లా నుంచి గోసంగి సందీప్, జి.శశిధర్ నాగ్, సాయి సూర్య, అప్పారి యశ్వంత్, మట్టపర్తి అవంతి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలో ఈ క్రీడా దినదినాభివృద్ధి చెందుతోందని, దానికి నిదర్శనమే ఈ ఐదుగురు జాతీయ స్థాయికి ఎంపిక అవడమని తెలిపారు. జిల్లాకు చెందిన కేత సాయి దుర్గా ప్రసాద్, రాష్ట్ర బాలుర, బాలికల జట్టు కోచ్గా యాండ్ర గౌతమ్, కోచ్లు గా రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాసులను నియమించినట్లు తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాంచీలో శిక్షణలో ఉన్నారని, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం తీసుకురావాలని తెలిపారు.
న్యాయసేవలు
వినియోగించుకోండి
కాకినాడ లీగల్: ప్రిజన్ లీగల్ ఎయిడ్ క్లినిక్ సేవలను రిమాండ్ ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ ఎన్.శ్రీలక్ష్మి అన్నారు. సోమవారం ఆమె కాకినాడ స్పెషల్ సబ్జైలును సందర్శించారు. వంటశాల, మహిళా ఖైదీల బ్యారక్, ఫిర్యాదుల పెట్టె, రికార్డులను పరిశీలించారు. రిమాండ్ ఖైదీలతో మాట్లాడి వారి ఆర్యోగ పరిస్థిఽతులు, వసతులు, భోజనం ఎలా ఉంది, ఎన్ని రోజుల నుంచి జైలులో ఉన్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న లీగల్ ఎయిడ్స్, సేవలపై అడిగి తెలుసుకున్నారు. అయితే ముగ్గురు నిందితులు మాట్లాడుతూ మాకు కేసులో రెండు షూరిటీలతో బెయిల్ అనుమతి వచ్చిందని, రెండు షూరిటీలు పెట్టుకునే స్థామత లేదని ఒక్క షూరిటీకి అనుమతి ఇప్పించాలని అడిగారు.


