ఈ దుర్ఘటన దురదృష్టకరం
మాజీ ఎంపీ చింతా అనురాధ
అల్లవరం: మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించడం దురదృష్ణకరమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు చింతా అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాఽ ద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చమురు కార్యకలాపాల వల్ల జరుగుతున్న గ్యాస్ ప్రమాదాల దృష్ట్యా క్రైసిస్ మేనేజ్మెంట్ సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటుగా యుద్ధ ప్రాతిపదికన కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. చమురు సంస్థల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో చమురు కార్యకలాపాలతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో జిల్లాలో క్రైసిస్ మేనేజ్మెంట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం, ఓఎన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ ఫెసిలిటీని ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.


