శాంతి భద్రతల పరిరక్షణకు పది సూత్రాలు
జిల్లాలో అమలు చేయాలని ఐజీ ఆదేశం
అమలాపురం టౌన్: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తాను సూచించిన పది సూత్రాల విధానాన్ని జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విధిగా అమలు చేయాలని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ ఆదేశించారు.
స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనా అధ్యక్షతన జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో శనివారం జిల్లాలో శాంతి భద్రతల సమావేశం నిర్వహించారు. ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ సున్నితమైన అంశాల గుర్తింపు, నివేదన, విజవల్ పోలీసింగ్, ఇంటెలిజెన్స్, క్షేత్ర స్థాయి పర్యవేక్షణ, గత సంఘటనలు, నేరాలపై విశ్లేషణ, సాంకేతిక వినియోగం, చట్టపరమైన చర్యలు, జిల్లాలోని ప్రధాన దేవాలయాల్లో ఏఆర్ డీఎస్పీ, సంబంధిత పోలీస్ సబ్ డివిజనల్ అధికారులతో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహణ వంటి సూత్రాలు, అంశాలపై ఐజీ సమీక్షించారు. జిల్లాలో అల్లర్లు సృష్టించే వారిపై, శాంతి భద్రతలకు విఘాగం కలిగించే వ్యక్తులపై నిరంతర నిఘా పెట్టాలని సూచించారు.
సంక్రాంతి పండగల సందర్భంగా పాత నేరగాళ్ల కదలికలపై నిఘాను విస్తృతం చేయాలని ఆదేశించారు. వారి నేర తీవ్రతలను బట్టి బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. వివాదాస్పద ప్రాంతాల్లో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి పీస్ కమిటీల ద్వారా సమస్యలను పరిష్కరించాలని ఐజీ స్పష్టం చేశారు. అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం డీఎస్పీలు టీఎస్ఆర్కే ప్రసాద్, సుంకర మురళీమోహన్, రఘువీర్, ఆర్మ్డ్ డీఎస్పీ సుబ్బరాజు, ఎస్బీ సీఐ వి.పుల్లారావు, డీసీఆర్బీ సీఐ ఆకుల మురళీకృష్ణ, సైబర్ క్రైమ్ సీఐ బి.తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు.


