
డీఎస్సీ తుది జాబితా విడుదల
● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో
1349 పోస్టుల భర్తీ
● దసరా సెలవుల తర్వాత
కొలువుదీరే అవకాశం
● ఈ నెల 22 నుంచి కొత్త టీచర్లకు
8 రోజుల శిక్షణ
రాయవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీచర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. సోమవారం ఉదయం డీఎస్సీ–2025 తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. క్యాడర్ల వారీగా ఎంపికై న ఉపాధ్యాయుల జాబితాను ఆన్లైన్లో విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 1,349 పోస్టులకు టీచర్ అభ్యర్థులను ఎంపిక చేశారు. వివిధ కారణాలతో నాలుగు పోస్టులు భర్తీ కాలేదు. కొత్తగా ఎంపికై న ఉపాధ్యాయులకు ఈ నెల 22 నుంచి ఉమ్మడి జిల్లా పరిధిలో సబ్జెక్టుల వారీగా శిక్షణ ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు స్కూల్ అసిస్టెంట్ స్టేట్ రీసోర్స్ పర్సన్స్(ఎస్ఆర్పీ)కు గుంటూరు జిల్లా పరిధిలోని విట్ యూనివర్శిటీ, ఎస్జీటీ ఎస్ఆర్పీలకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని హీల్ ప్యారడైజ్లో శిక్షణ ఇవ్వనున్నారు. దసరా సెలవుల అనంతరం కొత్త టీచర్లు కొలువు దీరే అవకాశముంది.
ఐదు నెలల అనంతరం
డీఎస్సీ–2025 ఫలితాలను సుమారు ఐదు నెలల అనంతరం విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ఉమ్మడి జిల్లా పరిధిలోని 1,241 మైదాన (ప్లెయిన్ ఏరియా) పోస్టులకు, 112 ఏజెన్సీ ఏరియా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1,352 పోస్టులకు 63,004 మంది దరఖాస్తు చేయగా, జూన్ 6వ తేదీ నుంచి సీబీటీ విధానంలో నిర్వహించిన పరీక్షలకు 38,617 మంది హాజరయ్యారు. జూలై 5న ప్రాథమిక కీ విడుదల చేయగా, ఫైనల్ కీ జూలై 31న ఫైనల్ కీ విడుదల చేశారు. ఆగస్టు 23న మెరిట్ లిస్ట్ విడుదల చేయగా, ఆగస్టు 28న ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నాలుగు విడతల్లో చేపట్టారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం సోమవారం డీఎస్సీ–2025 రాష్ట్ర కన్వీనర్ తుది ఎంపిక జాబితాను వెబ్సైట్లో ఉంచారు.
ఎంపికయిన పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 421 కాగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 818 ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో అధికంగా ఫిజికల్ ఎడ్యుకేషన్, ఆ తర్వాత సోషల్ స్టడీస్, బయాలజీ పోస్టులు మూడంకెల సంఖ్యలో ఉండగా, ఇంగ్లీషు, తెలుగు, హిందీ, గణితం, పీఎస్ సబ్జెక్టులు రెండంకెల్లో ఉన్నాయి. సంస్కృతం కేవలం ఐదు పోస్టులు భర్తీ అవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో మొత్తం 112 పోస్టులకు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఎస్జీటీలు 104, ఫిజికల్ సైన్స్ మూడు, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒకటి, బయోలాజికల్ సైన్స్ నాలుగు పోస్టులు భర్తీ అయ్యాయి. ఎస్జీటీ విభాగంలో స్థానిక సంస్థల్లో ఒకటి, మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్కో పోస్టు వంతున భర్తీ కాలేదు. అలాగే సంస్కృతం విభాగంలో స్థానిక సంస్థల మేనేజ్మెంట్లో రెండు పోస్టులు భర్తీ కాలేదు.
అర్హత ఉన్న అభ్యర్థులు లేక..
డీఎస్సీ–2025లో వివిధ క్యాటగిరీలకు చెందిన నాలుగు పోస్టులు అర్హత ఉన్న అభ్యర్థులు లేక భర్తీ కాలేదు. వీటిలో మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్లో ఒక ఎస్జీటీ, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యంలో ఒక ఎస్జీటీ, ప్రభుత్వ/స్థానిక సంస్థల యాజమాన్యంలో స్కూల్ అసిస్టెంట్ సంస్కృతం పోస్టులు రెండు భర్తీ కాలేదు.
గ్రీవెన్స్లో ఫిర్యాదుల స్వీకరణ
డీఎస్సీ–2025 ఫైనల్ సెలక్షన్ జాబితాలో సందేహాల నివృత్తికి గ్రీవెన్స్ ఏర్పాటు చేశారు. పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు తాము ఎందుకు అర్హత కోల్పోయామో తెలుసుకునేందుకు కాకినాడ డీఈవో కార్యాలయానికి క్యూ కడుతున్నారు.
శిక్షణ పొందిన ఉపాధ్యాయ అభ్యర్థులు (ఫైల్)
క్యాడర్లు, మేనేజ్మెంట్ వారీగా
ఎంపికై న ఉపాధ్యాయుల వివరాలు
క్యాడర్ సబ్జెక్టు ఎంపికైన
టీచర్ల సంఖ్య
ఎస్ఏ ఇంగ్లీషు 95
ఎస్ఏ హిందీ 78
ఎస్ఏ సంస్కృతం 05
ఎస్ఏ తెలుగు 58
ఎస్ఏ బయాలజీ 103
ఎస్ఏ గణితం 64
ఎస్ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ 210
ఎస్ఏ ఫిజికల్ సైన్స్ 71
ఎస్ఏ సోషల్ స్టడీస్ 132
ఎస్జీటీ ఎస్జీటీ తెలుగు 421