20 నుంచి దశల వారీగా విద్యుత్ అంతరాయం
అమలాపురం రూరల్: జిల్లాలో 132 కేవీ రామచంద్రపురం, కొత్తపేట, ముమ్మిడివరం డబుల్ సర్క్యూట్ లైన్కు సంబంధించి పాడైన 30 టవర్లకు మరమ్మతులు నిర్వహిస్తున్నందున ఈ నెల 20 నుంచి జాన్ 5వ తేదీ వరకు ఉదయం 6.00 నుంచి సాయంత్రం 7.00 గంటలు వరకు దశల వారీగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎలక్ట్రికల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ సిద్దెల రాజబాబు తెలిపారు. 132 కేవీ కొత్తపేట, రాజోలు, ముమ్మిడివరం పరిధిలో ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అమలాపురం మున్సిపాలిటీ, అమలాపురం రూరల్, అల్లవరం, అంబాజీపేట, అయినవిల్లి, కొత్తపేట, రావులపాలెం, రాజోలు, మామిడికుదురు, పి.గన్నవరం, మల్కిపురం, సఖినేటిపల్లి. మండలాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఎస్ఈ రాజబాబు తెలిపారు.
గ్రామాల అభివృద్ధిపై
దృష్టి సారించాలి
సాక్షి, అమలాపురం: అమలాపురం పార్లమెంట్ పరిధిలో సముద్ర తీర ప్రాంత గ్రామాల అభివృద్ధిపై చమురు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ గంటి హరీష్మాధుర్ అన్నారు. రాజమహేంద్రవరంలోని ఓఎన్సీజీ కార్యాలయంలో అసెట్ మేనేజర్ శంతనుదాస్, సంబంధిత అధికారులతో ఎంపీ హరీష్ శుక్రవారం భేటీ అయ్యారు. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు సీఎస్ఆర్ నిధులు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
ఆకట్టుకున్న మాక్ డ్రిల్
కాకినాడ సిటీ: కలెక్టరేట్ పై అంతస్తులో అగ్నిప్రమాదం.. వెంటనే విపత్తు స్పందన సిబ్బంది నిచ్చెన సహాయంతో భవనం లోపలకు చేరుకుని, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందికి తీసుకువచ్చారు.. బాధితులకు తక్షణం వైద్య సహాయం అందించేందుకు అప్పటికే సిద్ధంగా ఉంచిన 108 వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.. ఇదంతా నిజమనుకునేరు.. అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కొనేలా ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో సంబంధిత శాఖల సిబ్బంది కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన మాక్ డ్రిల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఇందులో అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్, పోలీసు, వైద్య, ఆరోగ్య, విద్యుత్ తదితర విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిప్రమాదాల నుంచి ప్రజలను రక్షించే విధానాన్ని ఆ శాఖ సిబ్బంది కళ్లకు కట్టినట్లు చూపారు. ప్రమాద ప్రాంతం నుంచి ప్రజలను కాపాడటం, సహాయక చర్యలు తదితర అంశాలను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వివరించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ భవనంలో కొంత భాగం కూలిపోయినట్లు ఊహించి.. అందులోని వారిని కాపాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూపించారు. గోడను కట్టర్లతో కట్ చేసి, భవనంలోకి ప్రవేశించి, లోపలున్న వారిని బయటకు తరలించడం అంశాలను చూపించారు. సీపీఆర్, అత్యవసర వైద్యంపై ఆ శాఖ సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ మాక్ డ్రిల్ను జేసీ రాహుల్ మీనా పర్యవేక్షించారు. మాక్ డ్రిల్స్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చని ఆయనన్నారు. డీఆర్ఓ జె.వెంకటరావు, మూడో బెటాలియన్ ఎస్డీర్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ ఎం.మోహన్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి పీవీఎస్ రాజేష్, డీఈఓసీ నోడల్ అధికారి, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏఎస్డీసీ డి.భారతి తదితరులు పాల్గొన్నారు.


