చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సోమవారం నుంచి పదో తరగతి మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో వ్యక్తిగత, అనారోగ్య సమస్యల దృష్ట్యా విధులను రద్దు చేయాలని కోరుతూ పలువురు టీచర్లు శనివారం డీఈవో కార్యాలయానికి వచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశాల సాకుతో డీఈవో వారి విన్నపాలను తోసిపుచ్చారు. విధులను రద్దు చేయడం సాధ్యం కాదని, మినహాయింపు కావాలంటే 10 రోజుల మెడికల్ లీవ్ పెట్టుకోవాలని సూచించడంతో టీచర్లు విస్మ యం వ్యక్తం చేశారు. సముచిత కారణాలతో వచ్చే వారికి సెలవు మార్గాన్ని చూపడమే తప్ప, సమస్యను పరిష్కరించే ఉద్దేశం అధికారులకు లేదని ఆరోపిస్తున్నారు. విధులు కేటాయించింది కమిషనర్ కార్యాలయమని, తమకు సంబంధం లేదని జిల్లా విద్యాశాఖ అధికారులు పేర్కొనడం బాధ్యతల నుంచి తప్పుకోవడమేనని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపులు ఇవ్వడంలో విద్యాశాఖ మీనమేషాలు లెక్కించడం మొండివైఖరికి నిదర్శనమని మండిపడుతున్నారు. పది రోజులు జరిగే మూల్యాంకన ప్రక్రియలో టీచర్లపై ఒత్తిడి పెంచడం కాకుండా, వారి సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కోరుతున్నారు.


