● ఇబ్బందులుంటే 08572–242734 నంబర్కు ఫిర్యాదు చేయండి ● జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ల సరపరాలో ఎటువంటి అంతరాయం లేదని జేసీ ఆదర్శ్ రాజేంద్రన్ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ సరపరా విషయంలో వినియోగదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కృత్రిమ కొరత వంటి వదంతులు నమ్మకూడదన్నారు. గ్యాస్ సరపరా, బుకింగ్కు సంబంధించి వినియోగదారులకు ఏవైనా సందేహాలుంటే నివృత్తి చేసుకునేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా సమస్యలుంటే వినియోగదారులు 08572–242734 నెంబర్కు పనిరోదినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు సంప్రదించాలన్నారు. ఇప్పటి వరకు కంట్రోల్ రూమ్కు 50 ఫిర్యాదులు రాగా, అందులో 46 సమస్యలను ఏజెన్సీలతో మాట్లాడి తక్షణమే పరిష్కరించినట్టు వెల్లడించారు.
వినియోగదారులకు సూచనలు
డెలివరీ సిబ్బందికి గ్యాస్ బిల్లులో ఉన్న ధర మాత్రమే చెల్లించాలి. ఎవరైనా అదనపు రుసుం డిమాండ్ చేస్తే వెంటనే కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయాలన్నారు. వాణిజ్య అవసరాలకు వారి వినియోగ్యాన్ని బట్టి 70 శాతం వరకు కమర్షియల్ సిలిండర్లను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.
అక్రమాలపై కఠిన చర్యలు
గ్యాస్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జేసీ హెచ్చరించారు. ప్రతి తహసీల్దార్ తమ పరిధిలోని గ్యాస్ ఏజెన్సీలను రోజూ తనిఖీ చేసి, స్టాక్, బుకింగ్ వివరాలను పర్యవేక్షించాలన్నారు. గృహ అవసరాల సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న వారిపై దాడులు చేసి ఇప్పటి వరకు 23 మంది పై 6ఏ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో 49 సిలిండర్లను సీజ్ చేసి జేసీ కోర్టులో సమర్పించారన్నారు. గుడిపాల మండలం కీర్తన గ్యాస్ ఏజెన్సీపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీచేశామన్నారు.


