కార్వేటినగరం : గత ఎన్నికల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్పై ప్రజల్లో నమ్మకం, విశ్వాసం లేదని మాజీ డెప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. సోమవారం శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట దీపిక కల్యాణ మండపంలో నియోజవర్గ స్థాయి బూత్ కమిటీ కన్వీనర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల వరకు 50 శాతం ఉన్న పోలింగ్ అమాంతంగా పెరిగి 2 సెకన్లకు ఒక ఓటు ఎలా వేశారో ప్రజల్లో ఇప్పటికీ సందేహం ఉందన్నారు. సుప్రీంకోర్టు కల్పించుకుని 2024 ఎన్నికల తీరును, అధికారుల వ్యవహార శైలికి సంబంధించిన నివేదికలు తెప్పించుకుందని గుర్తుచేశారు. ఏ గ్రామానికి వెళ్లినా ఎవ్వరిని అడిగినా తాము జగనన్నకు ఓటు వేశామంటూ చెబుతున్నారని, ప్రజలు వేసిన ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. దేశ వ్యాప్తంగా 5 వేల ఓట్లు లోపే సుమారు 35 శాతం మంది గెలిచినట్లు గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో ఎలాంటి పొరబాట్లు, నిర్లక్ష్యం, అజాగ్రత్తగా ఉండకూడదని సూచించారు.
జగనన్న నవరత్నాలే
ఎన్నికల ఆయుధం
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను నేడు దేశంలోని అన్ని రాష్ట్రాలు మేనిఫెస్టోలుగా పెడుతున్నాయని చెప్పారు. జగనన్న చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో అర్థం చేసుకోవాలన్నారు. నేడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షమాన్ని పక్కన పెట్టి అమరావతి, పోలవరం పేరుతో దోచుకుంటోందని ధ్వజమెత్తారు. రాజధాని అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అయితే రాజధాని ముసుగులో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలను ఉపేక్షించేది లేదన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధిలో సమానంగా ముందుకు సాగాలన్నదే తమ ధ్యేయమన్నారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ గతంలో తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దుమ్మెత్తి పోసిన కూటమి నేతలు నేడు సంపద సృష్టి అంటూ అప్పులను సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి మంగళవారం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్తో పేరుతో అట్టర్ ప్లాప్షో చూపిస్తోందని విమర్శించారు.


