నాయుడుపేట :
విశేషాలంకరణలో
శ్రీరామచంద్రమూర్తి
సిరి కల్యాణపు బొట్టును బెట్టి..మణి బాసికం నుదుటిన గట్టి.. పారాణి పాదాలకు బెట్టి..పెళ్లి కూతురైన సీతమ్మను చూసి భక్తులు తరించారు. సంపెంగ నూనెను కురులదువ్వి..సొంపుగ కస్తూరి నామం దీర్చి..చెంపన జివ్వాజి చుక్కను పెట్టి..పెళ్లి కొడుకై న రామయ్యను చూసి భక్త జనం పరవశించింది. జానకి దోసిట కెంపులు పోయగా..రాముని దోసిట నీలపురాశులై ఆణిముత్యాలు తలంబ్రాలుగా ఇరువుల మెరవగా భక్తకోటి మురిసింది. వేద మంత్రాలు.. మంగళవాయిద్యాలు మోగగా.. మోమున సిగ్గుతో తలదించుకుని ముసి ముసి నవ్వుల సీతమ్మ మెడలో రామయ్య తాళి కట్టిన కమనీయ ఘట్టం తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో నేత్రపర్వంగా సాగింది.. శ్రీరామనవమి సందర్భంగా రెండు జిల్లాల్లోని పలు ఆలయాల్లో జరిగిన సీతారాముల కల్యాణం చూసిన కనులదే భాగ్యం అన్న రీతిలో వైభవంగా సాగింది. –సాక్షి నెట్వర్క్


