మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మెడికల్ మాఫి యా ఆగడాలను అరికట్టాలని సీపీఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు చిత్తూరు నగరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని జిల్లా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట శనివారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి వీసీ గోపినాథ్ నాయకత్వం వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.నాగరాజు మాట్లాడుతూ నకిలీ, కాలం చెల్లిన మందులను అరికట్టడంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. మెడికల్ షాపుల యజమానులపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. కొన్ని మెడికల్ షాపులలో కాలం చెల్లిన, నకిలీ మందులను అమాయక ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా ప్రభుత్వం చొరవ తీసుకుని, జిల్లాలో మెడికల్ మాఫియాను అరికట్టకపోతే, భవిష్యత్తు లో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కె.మణి, దాసరి చంద్ర, సత్యమూర్తి, విజయ్ కుమార్, రఘు, విజయ గౌరీ, రమాదేవి, కుమారి, లతా రెడ్డి, ఫైరోజ్, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు.


