ప్రభావతం..ప్రాణ సంకటం
నేడు ఆస్పత్రిలో అపస్మారక స్థితి
బ్రెయిన్లో బ్లడ్ క్లాట్
రూ.20 లక్షలు ఖర్చవుతుందన్న వైద్యులు
ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు
కూలి పనులు చేసి ఇద్దరి పిల్లల్ని కంటికి రెప్పలా పెంచుతోంది. ఎలాగైనా ఉన్నత చదువులు చదివించి తండ్రిలేని లోటు తీర్చాలని కడుపు కట్టుకుని బిడ్డల్ని చదివిస్తోంది. ఇంతలో మాయదారి జబ్బు కూతురి ప్రాణాలకు చుట్టుకుంది. మరో పది రోజుల్లో పదో తరగతి పరీక్ష రాయాల్సిన బిడ్డ ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడడం చూసి జీర్ణించుకోలేక పోతోంది. శస్త్రకిత్సకు రూ.20 లక్షలు దాకా అవుతుందని వైద్యులు తేల్చడంతో అంత డబ్బు ఎలా సమకూర్చాలో తెలియక.. బిడ్డను బతికించుకోలేక దిక్కుతోచని స్థితిలో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది. ఆ తల్లి ఆరాటం.. బిడ్డ పోరాటానికి దయగల దాతలు చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నగరి : మండలంలోని తడుకుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ప్రభావతి (15) ప్రాణాలతో పోరాడుతోంది. తడుకు దళితవాడకు చెందిన ఈ విద్యార్థిని తండ్రి ప్రభాకర్ పన్నెడేళ్ల క్రితం మృతిచెందారు. తల్లి రాములమ్మ కూలి పని చేసుకుంటూ పిల్లలు ప్రభావతి, మదన్కుమార్ను పోషిస్తోంది. గత నెల 28వ తేదీన పాఠశాలలో నిర్వహించిన వీడ్కోలు సమావేశానికి హాజరై పరుగు పందెంలో విజేతగా నిలిచింది. బహుమతి అందుకొని ఎంతో ఉత్సాహంగా ఇం టికి వచ్చిన ప్రభావతికి ఆ రోజు రాత్రి నుంచి తీవ్ర జ్వరం పట్టుకుంది. తల్లి స్థానికంగా ఉన్న వైద్యశాలకు తీసుకెళ్లి మందులు తీసిచ్చినా రెండు రోజుల వరకు జ్వరం తగ్గలేదు. పైగా 3వ తేదీ రాత్రి కళ్లు తేలేయడంతో భయాందోళనకు గురైన తల్లి, బంధువులు స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తిరుపతి రూయాకు రెఫర్ చేశారు.
అక్కరకు రాని ఆరోగ్యశ్రీ
అక్కడ పరీక్షించిన వైద్యులు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని, సీరియస్ కండీషన్లో ఉందని తెలిపారు. ఆరోగ్యశ్రీలో దీనికి వైద్యం లేకపోడం, ఆపై పలువురి సూచనల మేరకు వేలూరు సీఎంసీకి తరలించారు. ఐదు రోజులపాటు అక్కడ వైద్యం అందించారు. తర్వాత ఆపరేషన్ చెయ్యాలని, అందుకు రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చారు.
సాయం అందించిన సహ విద్యార్థులు,
గురువులు
విద్యార్థి చదివిన పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రభావతి ప్రాణాలు కాపాడడంలో తమదే తొలి అడుగుగా రూ.70 వేలు దాకా పోగుచేసి విద్యార్థి తాత కన్నియప్పన్కు ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. దాతలు సహకారం అందించి తమ మిత్రురాలిని కాపాడాలని కోరుకున్నారు.
వారం క్రితం పరుగు
పందెంలో బహుమతి
ప్రభావతం..ప్రాణ సంకటం


