13న ఉపాధ్యాయుల గర్జన
చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మదన్మోహన్రెడ్డి విమర్శించారు. ఆ సంఘ నాయకులు మంగళవారం డీఈవో కార్యాలయ ప్రాంగణంలో పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం దశల వారీగా పోరాటాలు చేసేందుకు సిద్ధమయ్యామన్నారు. ఈ నెల 13న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ వాయిదా వేస్తూనే వెళ్లడం దారుణమన్నారు. పెరిగిన ధరల దృష్ట్యా వెంటనే 30 శాతం మధ్యంతర భృతి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. 2003 డీఎస్సీలో ఎంపికై న టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.34 వేల కోట్లు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 13వ తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడిలో జిల్లాలోని టీచర్లు, ఉద్యోగులు, పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నాయకులు గంటామోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పురుషోత్తం, ఉపాధ్యక్షులు దేవరాజులురెడ్డి, నాయకులు ఢిల్లీప్రకాష్, రాధాకుమారి, బాలచంద్రారెడ్డి, చంద్రన్, సుబ్రహ్మణ్యం పిళ్లై తదితరులు పాల్గొన్నారు.


