మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని నినాదాలు
● కోటి సంతకాల ప్రతులతో తిరుపతిలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ ● 11 నియోజక వర్గాల నుంచి భారీగా తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు ● ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వైద్యవిద్య ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపునకు జనం సిరా చుక్కలే కోటి సంతకాలు రూపం దాల్చుకుని గర్జించాయి. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులతో తిరుపతిలో చేపట్టిన ర్యాలీకి అనూహ్య స్పందన లభించింది. వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నగరంలోని పద్మావతిపురంలో ర్యాలీ చేపట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ప్రతులను ఆయా నియోజక వర్గాల సమన్వయకర్తలు ఇటీవలే తిరుపతి, చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డికి అందజేశారు. కోటి సంతకాల ప్రతులను తిరుపతి నుంచి అమరావతికి తరలించే సందర్భంలో జిల్లా కేంద్రమైన తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపుతో పుంగనూరు నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. గంగాధరనెల్లూరు నుంచి మాజీ మంత్రి నారాయణస్వామి, సమన్వయకర్త కృపాలక్ష్మి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. నగరి నుంచి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నగరం నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు భారీగా పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. చంద్రగిరి నియోజక వర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్రెడ్డి, విద్యార్థి సంఘం అధ్యక్షులు చెవిరెడ్డి హరిషత్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో తిరుపతిలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. చిత్తూరు నియోజక వర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్తో తిరుపతిలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ్ ఆధ్వర్యంలో పలమనేరు నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తిరుపతికి చేరుకున్నారు. శ్రీకాళహస్తి నుంచి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల్లో తిరుపతికి తరలివచ్చారు. సత్యవేడు నియోజక వర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తిరుపతికి చేరుకున్నారు. పూతలపట్టు నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తిరుపతికి తరలివచ్చారు. కుప్పం నుంచి ఎమ్మెల్సీ, నియోజక వర్గ సమన్వయకర్త భరత్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తిరుపతికి తరలివచ్చారు.
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన హోరు
తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి తరలివచ్చిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో నగరంలోని పద్మావతీపురం, శ్రీనివాసపురం ప్రాంతాలు కిటకిటలాడాయి. పద్మావతిపురంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ఐటీ కళాశాల వరకు, అక్కడి నుంచి తిరుపతి–తిరుచానూరు రహదారిలోని గరుడ వారధి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రద్దు చేయాలంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్నాయని వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు చవ్వా రాజశేఖరరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచ్లు, పార్టీ మండల కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
జగనన్నకు మంచి పేరు
వస్తుందనే ప్రైవేటుపరం
రాష్ట్రంలో 17మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవ్వరికీ సాధ్యం కాని విధంగా జగనన్న 17 మెడికల్ కళాశాలలను స్థాపించి అందులో ఐదు వాటిని పూర్తి చేసి అడ్మిషన్లు కూడా ప్రారంభించారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు కూడా 70శాతం పూర్తయ్యాయి. మెడికల్ కళాశాలల నిర్మాణాలతో జగనన్నకు మంచి పేరు వస్తుందన్న అసూయతో వాటిని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.
– ఆర్కే రోజా, మాజీ మంత్రి
చంద్రబాబుకు
ప్రజలే బుద్ధి చెబుతారు
పేద, మధ్య తరగతి వారికి వైద్య విద్య అందకుండా గల్లంతు చేసేందుకే మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. ఆయనకు ఎప్పుడూ పేదలంటేనే గిట్టదు. పేదల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, పేద విద్యార్థుల ఆశలను అడియాశలు చేస్తున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారు.
– నారాయణ స్వామి, మాజీ ఉప ముఖ్యమంత్రి
ప్రభుత్వ ఆస్తులు
కార్పొరేట్లకు దారాదత్తం
చంద్రబాబు నాయుడుకు పేదలంటే గిట్టదు. ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వం ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు పంచిపెట్టడంపైనే దృష్టి పెడుతారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం నిర్మించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసి రూ.వేల కోట్లు దోచేసేందుకు చంద్రబాబు చూస్తున్నారు. – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
వైఎస్సార్సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్
పేద పిల్లల భవిష్యత్తును
కాలరాసే కుట్ర
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో స్థాపించిన 17 మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి పేద, మధ్య తరగతి వారి పిల్లల భవిష్యత్తను కాలరాసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
– భూమన కరుణాకర రెడ్డి, వైఎస్సార్సీపీ
చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని నినాదాలు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వద్దని నినాదాలు


