
సన్నిహితులకు రక్ష.. చిరుద్యోగులకు శిక్ష
● వైకుంఠ ద్వార దర్శన భక్తుల తొక్కిసలాట ఘటన విచారణపై ఎన్నో అనుమానాలు ● సంబంధం లేని ఉద్యోగులపై వేటు ● ఉన్నతాధికారులు, పాలక మండలికి బాధ్యత లేదా? ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు, స్థానికులు
సాక్షి టాస్క్ఫోర్స్ : వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా జనవరి 8న తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో ఇద్దరు అధికారులను బాధ్యులను చేస్తూ వారిని బలిపశువులను చేసి చేతులు దులుపుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్ల విషయంలో కీలకంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారులపై ఎటువంటి చర్యలు లేకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన అనంతరం తిరుపతికి వచ్చిన సీఎం చంద్రబాబు చెప్పినట్టే నేడు చర్యలు తీసుకోవడంపై శ్రీవారి భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సన్నిహితులను కాపాడే కుట్రలో భాగంగా చిరుద్యోగులను బలిపశువులను చేశారంటూ మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సైతం అనుమానాలు వ్యక్తం చేశారు. సీబీఐ చేత విచారణ చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన డిమాండ్ చేశారు. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ఈ ఏడాది జనవరి 8న తిరుపతి పద్మావతి పార్కువద్ద నున్న రామానాయుడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆరుగురు భక్తులు మరణించగా.. 40 మందికిపైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై నాడు ఎస్పీ, జేఈఓని బదిలీ చేశారు. మరో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఆ ఆ ఘటనపై విచారణ చేపట్టింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తితో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా 54 మంది ప్రత్యక్ష సాక్షులు, మృతుల కుటుంబీకులు, గాయపడ్డ వారు, వారి బంధువులు, పోలీసు, విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులను కమిషన్ విచారించినట్లు తెలిపారు. తొక్కిసలాటకు ఇద్దరు అధికారులదే ప్రధాన బాధ్యత అని కమిషన్ అభిప్రాయపడినట్లు వెల్లడించారు. అందులో భాగంగా డీఎస్పీ వి. రమణకుమార్, శ్రీవేంకటేశ్వర గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డిని బాధ్యులను చేస్తూ నివేదిక ఇచ్చినట్లు తెలిసింది.
ఉన్నతాధికారులపై చర్యలేవీ?
అంత పెద్ద ఘటన జరిగితే.. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లలో కీలక భూమిక పోషించే టీటీడీ ఈఓ, ఏవీఎస్ఓ, పాలకమండలి సభ్యుల్లో ఏ ఒక్కరిని బాధ్యులను చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండు పర్యాయాలు వైకుంఠ ద్వార దర్శనానికి పదిరోజులు పెంచి భక్తులందరికీ అవకాశం కల్పించినా ఏ ఒక్క చిన్న పొరబాటు జరగకపోయినా.. పది రోజులు దర్శనం పెట్టిందే తప్పు అన్నట్టు కూటమి పెద్దలు ఆరోపణలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. తొక్కిసలాట వెనుక ఎన్నో అనుమానాలు ఉన్నా.. నివేదికలో ఏముందనే విషయం కూడా బహిర్గతం చేయకపోవడంపైనా ఆరోపణలు ఉన్నాయి. ప్రభు త్వం తూతూ మంత్రంగా విచారణ జరిపి చేతులు దు లుపుకోవటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సైతం అవే అనుమానాలను వ్యక్తం చేయడం గమనార్హం.
సన్నిహితులను కాపాడేందుకేనా?
తొక్కిసలాట అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆ రోజే వీరిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నాడు సీఎం చంద్రబాబు ఏదైతే చెప్పారో.. అదే విషయాలు నివేదికలో పొందుపరిచినట్లు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. సన్నిహితులను కాపాడేందుకే ఇద్దరు అధికారులను బలిపశువులను చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తూతూ మంత్రంగా విచారణ జరిపినట్లు వెల్లడించారు. అప్పట్లో భక్తులు చెప్పిన బాధలు, సమస్యలను పరిగణలోకి తీసుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీవేంకటేశ్వర గోశాల డైరెక్టర్ హరినాథరెడ్డి వైఎస్సార్సీపీకి అనుకూలురని ప్రచారం చేసి.. తొక్కిసలాటకు సంబంధమే లేని వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా అతడిని బలిపశువును చేశారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

సన్నిహితులకు రక్ష.. చిరుద్యోగులకు శిక్ష