
ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ సెల్ ఏర్పాటు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ సెల్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో పలు శాఖల అధికారులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. వైద్యశాఖ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ సెల్ ఏర్పాటుకు కార్యాచరణ వేగవంతం చేయాలన్నారు. వయస్సు, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా జనాభాలోని అన్ని వర్గాల్లో అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడంతో వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఏఎన్ఎం, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఇతర వైద్య సిబ్బందికి ఎన్సీడీ పై అవగాహన కల్పించాలని చెప్పారు. సీఎంసీ ఆధ్వర్యంలో హెచ్డబ్ల్యూసీ, పీహెచ్సీల్లో టెలీ కన్సల్టెన్సీ విషయంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డీఎంఅండ్హెచ్వో సుధారాణి, డీసీహెచ్ఎస్ పద్మాంజలి, సీఎంసీ ఆస్పత్రి ప్రతినిధి డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
పకడ్బందీగా బంగారు కుటుంబాల సర్వే
జిల్లాలో బంగారు కుటుంబాల అవసరాలను గుర్తించేందుకు చేపడుతున్న సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పలు శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. పీ–4 గ్రామ సభ వివరాలను వెంటనే అప్లోడ్ చేయాలన్నారు. జిల్లాలో ప్రతి సచివాలయంలో పది మంది మార్గదర్శకులను ఎంపిక చేసే ప్రక్రియ ఈ నెల 26 నుంచి చేపట్టాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 65,451 కుటుంబాలను గుర్తించగా 6,515 కుటుంబాలను దత్తత తీసుకున్నారన్నారు.
మహిళలకు రాయితీ డ్రోన్లు
చిత్తూరు కలెక్టరేట్ : రాయితీతో వ్యవసాయానికి వినియోగించే డ్రోన్లను చదువుకుని సాంకేతికత ఉన్న మహిళలకు అందిస్తామని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. జిల్లాలో అలాంటి మహిళలను గుర్తించాలని ఏపీఎం సీసీలను ఆదేశించారు. డ్వాక్రా మహిళలు కొత్త తరహా జోవనోపాధులపై దృష్టి వహించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ డ్వాక్రా మహిళల జీవనోపాధులు మెరుగుపడాలన్నారు. గ్రామాల్లో మెరుగైన జీవనోపాధులను గుర్తించాలన్నారు. కొత్త తరహా వ్యాపారాలపై సంఘ సభ్యులు మక్కువ పెడితే వారి ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయన్నారు. ప్రత్యేక వార్షిక ప్రణాళికతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వెలుగు 2.0 తో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. జిల్లాలో దాదాపు 45 మంది లబ్ధిదారులకు నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్తో రూ.50 వేలు విలువ చేసే ఎగ్ కార్డులను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమావేశంలో డీపీఎంలు రవికుమార్, సునీతాలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఎన్సీడీ సెల్ ఏర్పాటు