
విత్తుకున్న కష్టాలు!
వేరుశనగ విత్తనాల కోసం రైతులు ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్నారు. కాయల కోసం కుస్తీ పడుతున్నారు. రైతు సేవ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు సాకులు చెప్పి తప్పించుకుంటున్నారు. చివరకు పోలీసులను రగంలోకి దింపి ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా రైతుల నోరు నొక్కేస్తున్నారు.
కాణిపాకం: ఖరీఫ్ సీజన్ కింద జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల హెక్టార్ల దాకా వేరుశనగ సాగయ్యేది. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. 2024–25లో 34వేల హెక్టార్ల వరకే పంట సాగైంది. వేసిన పంట కూడా చేతికందక మట్టిపాలైంది. గుడిపాల, యాదమరి, పెనుమూరు తదితర మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినా ఇంతవరకు నష్టపహారం చేతికందనంటోంది. అయితే ఈసారి వర్షాలు సంమృద్ధిగా కురుస్తున్నాయి. వేరుశనగ సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం గతేడాది సాగు విస్తీర్ణాన్ని సాకుగా చూపి విత్తనాల సరఫరా విషయంలో కోత పెట్టింది. దీంతో రైతులు అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.
కాయల్లేవ్
గతంలో జిల్లాకు 40వేల క్వింటాళ్ల వరకు వేరుశనగ విత్తనాలు సరఫరా అయ్యేవి. ఒక్కో రైతుకు రెండు నుంచి మూడు బ్యాగులు దాకా ఇచ్చేవారు. ఈసారి 25,560 క్వింటాళ్ల కాయలు మాత్రమే వచ్చాయి. రైతుకు ఒక బ్యాగు కూడా అందని పరిస్థితి నెలకొంది. టోకన్ల కోసం గంటల తరబడి క్యూలో నిరీక్షించినా ఫలితం లేకుండా పోతోంది. టోకన్లు అందని వాళ్లు పంపిణీ కేంద్రాల వద్ద పడిగావులు కాస్తున్నారు. సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని రైతులకు సర్దిచెబుతున్నారు.
మళ్లీ వస్తాయని కుంటి సాకులు
కాయలు అరకొరగా రావడంతో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తలలుపట్టుకుంటున్నారు. అడిగిన వారికి సమాధానం చెప్పుకోలేక తికమక పడుతున్నారు. రైతులు అడిగే ప్రశ్నలకు నోరు మెదపలేకపోతున్నారు. కొందరు కూటమి నేతలు సైతం కాయల కోసం సిబ్బందిని వేధిస్తున్నారు. ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నారు. ఈ తరుణంలో వారి కోపతాపలను అణగ దొక్కి బాధ్యతలను గుర్తుచేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో జరిగే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ క్రమంలో వారు రైతులకు మాయమాటలు చెప్పాల్సి వస్తోంది. మళ్లీ కాయలు వస్తాయని, వస్తే పిలుస్తామని.. ఆధార్, పట్టాపాసు పుస్తకం జిరాక్స్ పత్రాలు తీసుకుని పంపించేస్తున్నారు. అయితే మళ్లీ కాయలు వచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఉన్నంతలోనే సర్దుబాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకుంటే అన్నదాత సుఖీభవలో కోతలు పడతాయంటూ భయపెడుతున్నారు.
వేరుశనగ విత్తనాల కోసం ముప్పుతిప్పలు
అరకొర విత్తనాలతో సర్దిపెడుతున్న అధికారులు
విత్తనకాయల కోసం రైతుల కుస్తీ
పట్టించుకోని అధికారులు, పాలకులు
విత్తనాలు కూడా ఇవ్వకపోతే ఎలా?
రెండు సీజన్లకు సంబంధించి ప్రభుత్వం పంపిణీ చేసేది..ఒక్క వేరుశనగ విత్తనం మాత్రమే. ఆ విత్తనాలు కూడా ఇవ్వపోతే ఎలా..?. ఇప్పుడున్న రోజుల్లో రైతులను బతికిస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. ప్రభుత్వం స్పందించి వేరుశనగ పంటకు కావాల్సిన మేర విత్తనాలు పంపిణీ చేయాలి.
– సభాపతి, రైతు, చిత్తూరు మండలం

విత్తుకున్న కష్టాలు!