
సమస్యలు పరిష్కరించండి
చిత్తూరు కలెక్టరేట్ : సమస్యలు పరిష్కరించండయ్యా..అంటూ జిల్లాలోని ప్రజలు ఉన్నతాధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్వో మోహన్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 235 అర్జీలు వచ్చినట్టు కలెక్టరేట్ ఏవో కులశేఖర్ వెల్లడించారు.
విచారించకుండానే..
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసిన తమ వినతిపత్రాన్ని క్షేత్ర స్థాయిలో విచారించకుండా సమస్య పరిష్కరించేశామని క్లోజ్ చేసేశారని విజయపురం మండలానికి చెందిన వేలు, పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు జేసీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. మార్చి 19న చిత్తూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. విజయపురం మండలం కోసలనగరం సొసైటీ బ్యాంక్లో పనిచేస్తున్న ఇన్చార్జి సీఈవో రాధా, మాజీ సీఈవో మురుగయ్య రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఇందుకు తగిన ఆధారాలు సైతం వినతిపత్రం తో పాటు అందజేశామన్నారు. వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఎస్ఐ అని చెబుతూ ఓ వ్యక్తి తమకు కాల్ చేసి బెదిరింపులు చేస్తున్నారన్నారు. దీనిపై విచారించకుండా సమస్య పరిష్కరించామని చెప్పడం బాధాకరమన్నారు.
రోడ్డు మార్గం కల్పించాలి
గుడిపాల మండలం ఒంటిల్లు గ్రామానికి ఎటువంటి రోడ్డు మార్గం లేదని, అధికారులు స్పందించి తమ గ్రామానికి రోడ్డుమార్గం చూపించాలని గ్రామస్తులు రామదాసు, గోపి కోరారు. ఈ మేరకు వారు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం అందజేశారు. తమ గ్రామం వద్ద బెంగళూరు–చైన్నె ఎక్స్ప్రెస్ హైవే మార్గం వెళ్తోందన్నారు. విలేజ్ టర్న్ యాక్టివిటీ రోడ్డు ఆ హైవే వల్ల కోల్పోయిందన్నారు.
కలెక్టరేట్లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక
అర్జీలు స్వీకరించిన జేసీ విద్యాధరి

సమస్యలు పరిష్కరించండి