
విత్తు.. చిత్తు
వేరుశనగ విత్తనాల కోసం నిరీక్షణ
ఎర్రటి ఎండలో రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూపులు
టి.పుత్తూరు ఆర్ఎస్కేలో ఎస్ఐ పర్యవేక్షణలో రిజిస్ట్రేషన్
తవణంపల్లె: కూటమి ప్రభుత్వంలో వేరుశనగ విత్తనాల కోసం రైతులు నానాఅగచాట్లు పడుతున్నారు. విత్తన కాయలు దొరుకుతాయో లేదోనని రైతు సేవా కేంద్రాల వద్ద అర్ధరాత్రి నుంచే క్యూ కడుతున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ఎర్రటి ఎండను సైతం లెక్కచేయక నిరీక్షిస్తున్నారు. మండలానికి గత ఏడాది 1,710 క్విటాళ్ల వేరుశనగ విత్తనాలను సరఫరా చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం 1,110 క్వింటాళ్లు మాత్రమే అందజేశారు. సోమవారం మండలంలోని టి.పుత్తూరు, పుణ్యసముద్రం, పైమాఘం, సరకల్లు రైతు సేవా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ కోసం వ్యవసాయశాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారు.
నీరసిస్తూ..నిరీక్షిస్తూ..
రైతు సేవా కేంద్రాల్లో సోమవారం వేకువ జాము నుంచే రైతులు తమ ఆధార్, పట్టాదారు పుస్తకాలు చేతబట్టి క్యూకట్టారు. రైతులందరూ ఒకే సారి ఎగబడడంతో సిబ్బంది రిజిస్ట్రేషన్ చేయడానికి పోలీసులను ఆశ్రయించారు. అనంతరం పోలీస్ బందోబస్తు మధ్య రిజిస్ట్రేషన్ చేయించారు. టి.పుత్తూరు రైతు సేవా కేంద్రంలో అయితే ఉదయం 5 గంటల నుంచే రిజిస్ట్రేషన్ కోసం రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. తవణంపల్లె ఎస్ఐ చిరంజీవి జోక్యం చేసుకొని రైతులను క్యూలో పంపి రిజిస్ట్రేషన్ చేయించారు. ఎండలో ఎండుతూ.. చమటలు కక్కుకుంటూ రిజిస్ట్రేషన్ కోసం నిరీక్షించాల్సి వచ్చింది.
అందుతాయో లేదో..
మండలానికి గత ఏడాది కంటే కూటమి ప్రభుత్వం 600 క్వింటాళ్ల మేర తక్కువ విత్తనాలు అందజేసింది. సోమవారం 806 మంది రైతులకు 242 క్వింటాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించినట్లు తవణంపల్లె ఇన్చార్జి వ్యవసాయాధికారిణి వందన తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న రైతులకు మరుసటి రోజు నుంచే విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. రైతులు ఆర్ఎస్కే సిబ్బందికి సహకరించాలని సూచించారు.

విత్తు.. చిత్తు