
విగ్రహ పునఃప్రతిష్టాపనకు ఆహ్వానం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈనెల 30న చేపట్టే శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ పునఃప్రతిష్టాపనకు విచ్చేయాలని కలెక్టర్ను ఆహ్వానించారు. బుధవారం కాణిపాకం ఆలయ ఏఈఓ రవీంద్రబాబు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీని కలిసి ఆహ్వానం అందజేశారు. ఏఈవో మాట్లాడుతూ.. ఈనెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్య కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోని శ్రీ ఆంజనేయస్వామి విగ్రహం ను పునఃప్రతిష్టాపన చేస్తామన్నారు. మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం నిర్వహిస్తామన్నారు. అనంతరం వేద పండితులు కలెక్టర్కు వేద మంత్రాలతో ఆశీర్వదించి ఆలయ ప్రసాదంను అందజేశారు. కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.
జూన్ నుంచి ‘టీబీ ముక్తభారత్’
చిత్తూరు రూరల్(కాణిపాకం) : జిల్లాలో జూన్ నెల మొదటి వారం నుంచి టీబీ ముక్తభారత్ కార్యక్రమం ప్రారంభమవుతుందని డీఎంహెచ్ఓ సుధారాణి పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో బుధవారం ఎంఎల్పీహెచ్లతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో జూన్ మొదటి వారం నుంచి వంద రోజుల పాటు టీబీ ముక్తభారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. హైరిస్క్ జనాభా ఉన్న ప్రాంతంలో 60 ఏళ్లు పైబడిన వారందరికీ మధుమేహం, బీపీ, మద్యం తాగేవారికి, గతంలో టీబీ ఉన్నవారికి టీబీ స్కీన్రింగ్ పరీక్షలు చేస్తామన్నారు. కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
ఎంపీహెచ్ఓలకు
పూర్తయిన కౌన్సెలింగ్
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం ఎంపీహెచ్ఓలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 92 మందికి డీఎంహెచ్ఓ సుధారాణి సమక్షంలో కౌన్సెలింగ్ చేశారు. సాయంత్రానికి కౌన్సిలింగ్ పూర్తి చేసి హైరిస్క్ ప్రాంతాల్లో పనిచేసేలా నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ తదితరులున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి –అపోలోపై విచారణ
– జూన్ 3వ తేదీన కమిటీ రాక
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి–అపోలోలో జరుగుతున్న లోపాలు, నిర్వహణ తదితర అంశాలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఓ కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో రాష్ట్ర డీఎస్హెచ్ రమేష్నాథ్, డిప్యూటీ కమిషనర్ రమేష్ కిషోర్, రాష్ట్ర వైద్యవిధాన కార్యదర్శి పద్మకుమారి, రాష్ట్ర డీఎస్హెచ్ ఈఈ విజయ భాస్కర్, రాష్ట్ర డీఎస్హెచ్ బయో మెడికల్ ఇంజినీర్ సందీప్రెడ్డిని నియమించింది. వీరు జూన్ 3వ తేదీన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రానున్నారు. ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు.

విగ్రహ పునఃప్రతిష్టాపనకు ఆహ్వానం