
సమన్వయంతో జంతు సంక్షేమం
చిత్తూరు కలెక్టరేట్ : సంస్థల సమన్వయంతో జంతు సంక్షేమానికి చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఏబీసీ కార్యక్రమంపై పలు శాఖల అధికారులు, ఎన్జీవో సంఘం నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల చిత్తూరులో ప్రారంభించిన ఏబీసీ సెంటర్ ఏర్పాటుపై చిత్తూరు అనిమల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు కలెక్టర్కు కృతజ్ణతలు తెలిపారు. వీధి కుక్కల నియంత్రణకు చిత్తూరులో ఏబీసీ కేంద్రం ప్రారంభించడం హర్షణీయమన్నారు. జంతువులకు ఆహారం, వైద్య సేవల కొరత వంటి సమస్యలతో ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంహెచ్వో లోకేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ హరి, కిసాన్ డాక్టర్ ధనంజయ్, చిత్తూరు అనిమల్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు న్యాయవాది మాలతి, మంజునాథరెడ్డి, ఆర్తీ, విజయశిరీష పాల్గొన్నారు.
పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి
చిత్తూరు కలెక్టరేట్ : స్వయం సహాయక సంఘాల సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి వెల్లడించారు. గురువారం డీఆర్డీఏ కార్యాలయంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ప్రమీల అధ్యక్షతన జిల్లా సమాఖ్య సమావేశం నిర్వహించారు. డీఆర్డీఏ పీడీ మాట్లాడుతూ.. జిల్లాలో లక్ష మంది సంఘం సభ్యులను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. జిల్లాలో వెదురు, మునగ పంటల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మొబైల్ వ్యాన్లో రైతుల పండించిన తాజా కూరగాయలు, సంఘం సభ్యులు చిరుధాన్యాలతో తయారు చేసిన తినుబండారాలు, చిరు ధాన్యాలను ప్రజల వద్దకే తీసుకెళ్లి విక్రయించే కార్యక్రమాన్ని తవణంపల్లి మండలంలో చేపట్టారన్నారు. సమావేశంలో డీపీఎం రవి, ఏపీఎంలు హేమ, సుబ్బారెడ్డి, మధు పాల్గొన్నారు.
అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం ఈనెల 29న జారీచేసిందన్నారు. ఈ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అక్రిడిటేషన్ కార్డుల కాల పరిమితిని జూన్ 1 తేదీ నుంచి ఆగస్టు 31 వరకు పెంచుతున్నామన్నారు.

సమన్వయంతో జంతు సంక్షేమం