
టీచర్ల బదిలీల్లో రగడ
● డీఈఓపై దురుసు ప్రవర్తన
● మహిళా అధికారిణిని కించపరిచేలా వ్యాఖ్యలు
● కమిషనర్కు ఫిర్యాదు చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులు
చిత్తూరు కలెక్టరేట్ : బాధ్యతగా వ్యవహరించి సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన సంఘం నాయకులు డీఈఓ పై దురుసుగా ప్రవర్తించారు. ప్రస్తుతం టీచర్ల కసరత్తు జరుగుతున్న విషయం విధితమే. ఏ శాఖలోనూ లేని విధంగా విద్యాశాఖలో నిర్వహిస్తున్న బదిలీల కసరత్తు అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అయినప్పటికీ ఆ ఒత్తిడిని భరిస్తూనే జిల్లా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన సమస్యను రోడ్డున పడే విధంగా వ్యవహరించి విమర్శలకు తావిస్తున్నారు.
రీ అపోర్స్మెంట్ పాయింట్లపై వివాదం
జిల్లాలోని కొంత మంది టీచర్లకు రీ అపోర్స్మెంట్ పాయింట్లు నమోదు చేయడం లేదంటూ ఫ్యాఫ్టో సంఘం నాయకులు గురువారం డీఈఓ వరలక్ష్మికి ఫిర్యాదు చేశారు. డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు నిర్వహిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి అక్కడకు చేరుకున్న వివిధ సంఘాలు, ఫ్యాఫ్టో నేతలు డీఈఓతో వాదనకు దిగారు. రీ అపోర్స్మెంట్ పాయింట్లు ఎందుకు ఇవ్వరంటూ దురుసుగా ప్రవర్తించారు. తిరుపతి జిల్లా ఫ్యాఫ్టో నాయకులు, ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు సురేష్ మహిళా డీఈఓ వరలక్ష్మి పై దురుసుగా ఆమె కేడర్ ను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రవర్తనను చూసిన మిగిలిన సంఘం నాయకులు అడ్డు పడుతున్నప్పటికీ రెచ్చిపోయారు. రీ అపోర్స్మెంట్ పాయింట్ల క్లారిఫికేషన్ ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెబుతున్నా ఆ సంఘం నేత కోపంతో ఊగిపోయారు. అసహనానికి లోనైన జిల్లా విద్యాశాఖ అధికారులు దురుసుగా ప్రవర్తించిన తిరుపతి జిల్లా ఏపీటీఎఫ్ సంఘం నేత సురేష్, చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలానికి చెందిన ఎస్జీటీ విజయకుమార్పై శాఖాపరమైన చర్యలకు కమిషనర్ కు నివేదిక పంపినట్లు తెలిసింది. ఆ ఇద్దరిపై త్వరలో వేటు పడనున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
సమస్యను పరిష్కరించిన అధికారులు
బదిలీల ప్రక్రియలో 2021 బదిలీల్లో వచ్చి 2025 బదిలీల్లో రీ అపోర్స్మెంట్ గురవుతున్న టీచర్లకు పాత స్టేషన్ పాయింట్లు వర్తింపజేయాలన్న టీచర్ల డిమాండ్ను జిల్లా విద్యాశాఖ అధికారులు పరిష్కరించారు. ఈ సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేశారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్న స్కూల్ అసిస్టెంట్లు ఈనెల 29వ తేదీలోపు, ఎస్జీటీలు ఈనెల 30వ తేదీ నుంచి గ్రీవెన్స్లో పాత స్టేషన్ పాయింట్లకు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు.