పలమనేరు /గంగవరం : కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన గంగవరం మండలంలోని గండ్రాజుపల్లి వద్ద చైన్నె– బెంగళూరు హైవేలో గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని గంటావూరుకు చెందిన సయ్యద్ మహ్మద్(57) స్కూటర్పై స్వగ్రామానికి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ఇన్నోవా కారు అతడి బైక్ను ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గంగవరం పోలీసులు మృతదేహాన్ని పలమనేరు ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో సాప్ట్వేర్ ఇంజినీరు ..
పలమనేరు /గంగవరం : బెంగళూరులో గురువారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గంగవరం మండలంలోని సామరాజుపల్లికి చెందిన శ్రీనివాసులరెడ్డి కుమార్తె లిఖిత(45) బెంగళూరులో సాప్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తోంది. సిటీలోని హుగ్లీ గేట్ వద్ద రోడ్డు దాటుతుండగా బైక్ ఆమెను ఢీకొంది. దీంతో ఆమెకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. అక్కడే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు.
బైక్ను ఢీకొన్న కారు : ఇద్దరి మృతి
బంగారుపాళెం : మండలంలోని పాలమాకులపల్లె వద్ద చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. చిత్తూరు పట్టణం లక్ష్మీనగర్కు చెందిన అమరేంద్రబాబు(48), బంగారుపాళెం మండలం పెరుమాళ్లపల్లెకు చెందిన రమేష్(44) మేసీ్త్ర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరూ ద్విచక్రవాహనంపై పనులకు వెళ్లి బలిజపల్లె నుంచి బంగారుపాళెం వైపు వస్తూ రోడ్డు క్రాస్ చేస్తుండగా చిత్తూరు నుంచి పలమనేరు వెళుతున్న కారు.. బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పంటలపై ఏనుగుల విధ్వంసం
చౌడేపల్లె : మండలంలోని పందిళ్లపల్లె పంచాయతీ తొప్పిరెడ్డిపల్లె, ముదిరెడ్డిపల్లె, చుక్కావారిపల్లె పరిసర ప్రాంతాల్లోని పంటలను గురువారం తెల్లవారు జామున ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. వరి ,మామిడి, బెండ, బీర, టమాట పంటలను తొక్కి నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బోర్ల పైపులు ధ్వంసం చేసి విరిచేశాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.