
‘మహా’ అగచాట్లు
● మహానాడు సేవలో ఆర్టీసీ ● ప్రయాణికులను పట్టించుకోని ప్రభుత్వం ● తమిళనాడు, బెంగళూరుకు బస్సుల్లేక ఇక్కట్లు ● జిల్లా వ్యాప్తంగా 200 పైగా బస్సుల మళ్లింపు ● ‘మెప్మా’ ద్వారా బలవంతపు జన సమీకరణ
ఆర్టీసీ అధికారుల మౌనం
మహానాడుకు సభలకు చిత్తూరు డిపో నుంచి 90, కుప్పం 50, పుంగనూరు 50, పలమనేరు నుంచి 27 బస్సులను కడపకు మళ్లించారు. జిల్లా మొత్తంగా 200కు పైగా ఆర్టీసీ బస్సుల లోటు రావడంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ చర్యలు కల్పించడంలో అధికారులు చేతులెత్తేశారు. జిల్లా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు కావడంతో బెంగళూరు, వేలూరుకు నిత్యం వందల ట్రిప్పుల్లో ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేయాల్సి ఉంది. బస్టాండుల్లో బస్సుల కోసం ప్రజలు గంటల కొద్దీ నిరీక్షిస్తున్నా, సీట్ల కోసం కుస్తీలు పడుతున్నా అధికారులు మౌనంగా చూస్తూ ఉండిపోయారు. మహానాడుకు ఆర్టీసీ బస్సులు ఇచ్చి తీరాల్సిందేనని ప్రభుత్వం నుంచి అధికారులకు మౌఖిక ఉత్తర్వులు రావడంతో తాము ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఓ జిల్లా అధికారి పేర్కొన్నారు.
చిత్తూరు అర్బన్ : తెలుగుదేశం పార్టీ కడపలో నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమానికి జిల్లా నుంచి దాదాపు 200 ఆర్టీసీ బస్సులను తరలించారు. దీంతో జిల్లాలోని ప్రయాణికులకు మూడు రోజులుగా తీవ్ర అవస్థలు పడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆర్టీసీ సంస్థపై.. ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు ప్రజల్లో నమ్మకం సన్నగిల్లేలా చేస్తున్నాయి. కడపలో జరుగుతున్న మహానాడుకు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను కేటాయించడంతో జిల్లాలోని పలు ప్రాంతాలకు బస్సుల్లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
మహిళా సంఘాలు రాకపోతే జరిమానా
కడప నగరంలో మూడు రోజులుగా మహానాడు కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇది పూర్తిగా ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యక్రమం. ఓ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులను మహానాడుకు సభలకు తీసుకెళ్లడానికి ఆయా నియోజకవర్గాల్లోని టీడీపీ ప్రజాప్రతినిధులు పడుతున్న పాట్లు అన్నీ, ఇన్నీ కావు. పలమనేరు, కుప్పం, పుంగనూరు, నగరి మున్సిపాలిటీలతో పాటు చిత్తూరు కార్పొరేషన్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు జన సమీకరణ బాధ్యత తీసుకున్నారు. ఇందు కోసం ప్రతి మున్సిపాలిటీలోని మహిళా సంఘాలను మహాసభలకు పంపించారు. ఎవరైనా సభలకు రాకపోతే రూ.300 జరిమానా విధిస్తామని, సంక్షేమ పథకాలు రావని భయపెట్టి మహిళలను కడపకు తరలించారు.
గంటల కొద్దీ నిరీక్షణ
జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల కొరత ఏర్పడటంతో సకాలంలో గమ్యస్థానానికి చేరుకోలేక ప్రయాణికులు అవస్థలు పడ్డారు. చిత్తూరు నుంచి తమిళనాడులోని వేలూరులో చదువుకునే విద్యార్థులు, వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లే రోగులు బస్సుల్లేక పడరాని పాట్లు పడ్డారు. గమ్యస్థానానికి బస్సులు లేకపోవడంతో గంటల తరబడి బస్టాండుల్లో నిరీక్షించాల్సి వచ్చింది. చిన్న పిల్లలతో వచ్చిన వాళ్లు, మహిళలు, తిరుమల నుంచి తమిళనాడుకు వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సు ల కోసం నిరీక్షించి, నీరసించిపోయారు. పల్లె వెలుగు నుంచి లగ్జరీ బస్సుల వరకు టీడీపీ సభలకు తరలించడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తిరుపతి, బెంగళూరు, పీలేరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, తవణంపల్లి, పెనుమూరు, జీడీ నెల్లూరు కడప తదితర మార్గాల్లో నిత్యం రద్దీగా కనిపించే ఆర్టీసీ బస్సులు.. ఆయా ప్లాట్ఫామ్లపై నిర్మానుషంగా కనిపించాయి.