
నేటి నుంచి ‘గురుకుల’ంలో అడ్మిషన్లు
కుప్పం : రామకుప్పం మండలం విజలాపురంలోని గురుకుల గిరిజన బాలుర పాఠశాలను గిరిజన బాలికల స్కూలుగా మార్పు చేస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారతశాఖ అధికారి ఎస్.మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి పాఠశాలలో బాలికల అడ్మిషన్లు చేపడుతున్నట్లు వెల్లడించారు. 3 నుంచి 8వ తరగతి బాలికలకు ప్రవే శం కల్పించనున్నట్లు వివరించారు. కేవలం కుప్పం నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా గిరిజన బాలికలకు ఈ పాఠశాలలో అడ్మిషన్కు అవకాశమిస్తున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9502806425 నంబర్లో హాస్టల్ వార్డెన్ వెంకటేశ్వరబాబును సంప్రదించాలని సూచించారు.
బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
చిత్తూరు అర్బన్ : పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ..మృతి చెందిన కుటుంబాలకు చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసుశాఖ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ మణికంఠ చందోలు ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. కార్వేటినగరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అనారోగ్యం కారణంగా మార్చి 31వ తేదీన హెడ్ కానిస్టేబుల్ కుబేంద్ర మృతి చెందారు. ఇందుకు గాను మృతుడి భార్య వాణికి రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కు ఇచ్చారు. అలాగే చిత్తూరులో పనిచేస్తూ ఫిబ్రవరి 2వ తేదీన శ్యామల కుమారి మృతి చెందారు. మృతురాలి కుమారుడు ప్రశాంత్కు రూ.లక్ష చెక్కును అందజేసి వారికి భరోసా ఇచ్చారు.
నిబంధనలు అతిక్రమిస్తే సహించం
చిత్తూరు రూరల్(కాణిపాకం): ఆర్ఎంపీలు నిబంధనలు అతిక్రమిస్తే సహించే ప్రసక్తే లేదని డీఎంహెచ్ఓ సుధారాణి హెచ్చరించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ గర్భిణులకు స్కానింగ్ చేసే అధికారం ఆర్ఎంపీలకు లేదని స్పష్టం చేశారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమన్నారు. స్కానింగ్ సెంటర్లకు రెఫర్ చేసినా చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
యోగాతో శక్తి.. ప్రశాంతత
కాణిపాకం : యోగాతో శక్తి, ప్రశాంతత సిద్ధిస్తుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద యోగాంధ్ర కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆరోగ్యవంతం జీవనానికి ప్రతి ఒక్కరూ నిత్యం యోగా చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో యోగా మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.ఈ క్రమంలో కాణిపాకం, పులిగుండు, బోయకొండ, కంగుంది ప్రాంతాల్లో యోగ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా యోగాసనాల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం యోగాసనాలు వేశారు. ఆలయ ఈఓ పెంచల కిషోర్, డీఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఆర్డీఓ భవానీ, డీఎంహెచ్ఓ సుధారాణి, దేవదాయశాఖ ఏసీ చిట్టెమ్మ పాల్గొన్నారు.
వ్యాధి నిరోధక సంజీవని..
చిత్తూరు కలెక్టరేట్ : యోగా వ్యాధి నిరోధక సంజీవని అని జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. మంగళవారం పీవీకేఎన్ ప్రభుత్వ కళాశాల వద్ద యోగా మందిరంలో నిర్వహిస్తున్న మాస్టర్ ట్రైనర్స్ శిక్షణలో ఆయన పాల్గొన్నారు. వెంకటరమణ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నేటితో మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసినట్లు వెల్లడించారు. శరీరాన్ని మనస్సుతో సంయోగం చేసే ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రక్రియ యోగా అని వివరించారు. కార్యక్రమంలో డీఎస్డీఓ బాలాజీ, జీసీడీఓ ఇంద్రాణి, ఆయుష్ వైద్యులు ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.

నేటి నుంచి ‘గురుకుల’ంలో అడ్మిషన్లు

నేటి నుంచి ‘గురుకుల’ంలో అడ్మిషన్లు