
నేడు పలమనేరులో గ్రీవెన్స్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో చేపట్టనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు.ఆయన ఆదివారం మాట్లాడుతూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినతులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.
నేడు పోలీసు కార్యాలయంలో..
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించనున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యపై నేరుగా కలిసి తెలియ జేయవచ్చని సూచించారు. ఉదయం 10.30 గంటల నుంచి వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడతామని వెల్లడించారు.
డీఆర్సీ సమావేశం రేపు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా అభివృద్ధి కమిటీ (డీఆర్సీ) సమావేశం మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైతే శాఖాపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు.
చిత్తూరు డీవైఈఓగా ఇందిర
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు డీవైఈఓగా రొంపిచెర్ల ఎంఈవో–1 ఇందిరను నియమిస్తూ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఆర్జేడీకి రిపోర్టు చేసిన తర్వాత డీవైఈఓ విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పేరుతో దౌర్జన్యం
– బాధితుల ఆవేదన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): కూటమికి చెందిన ఓ మహిళా నేత జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పేరు చెప్పి తమపై దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఉష, సుజన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం చిత్తూరు ప్రెస్క్లబ్లో వారు మాట్లాడారు. పెనుమూరు మండలం సామిరెడ్డిపల్లెలో తమకు రెండు ఎకరాల భూమి ఉందన్నారు. తమ తల్లిదండ్రులు పసుపు కుంకుమం కింద సదరు భూమిని ఇచ్చనట్లు వెల్లడించారు. అయితే కూటమి నేత అరుణకుమారి దారిని ఆక్రమించుకుని, దాన్ని కాపాడుకునేందుకు తమ భూమిలో సీసీ రోడ్డు వేయిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఎమ్మెల్యే థామస్ ఆదేశించారంటూ బెదిరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే , ఇతర నేతలు ఆమె అక్రమాలను గుర్తించాలని కోరారు. లేకుంటే ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
ఐసెట్ హాల్ టికెట్లు విడుదల
తిరుపతి సిటీ:ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాల కోసం ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసెట్–2025 హాల్ టికెట్లను ఆదివారం నుంచి ఆన్లైన్లో విడుదల చేశారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, హాల్టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. ఈనెల 7వ తేదీన ఐసెట్–2025 పరీక్ష నిర్వహించనున్నారు.
డిగ్రీ పరీక్ష సెంటర్ల మార్పు.. విద్యార్థులకు అవస్థలు
తిరుపతి సిటీ: ఎస్వీయూ అధికారుల తీరుతో డి గ్రీ 2వ, 4వ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థు లు అవస్థలు తప్పడం లేదు. దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన నీట్ కోసం డిగ్రీ కళాశాలల్లో పరీ క్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. డిగ్రీ పరీక్షల సెంటర్లు ఆయా కళాశాలలో ఏర్పాటుచేసినట్టు హాల్ టికెట్లలో ఉంది. అధికారులు మాత్రం నీట్ జరుగుతున్న కేంద్రాల్లో సెంటర్లు ఉన్న డిగ్రీ విద్యార్థులకు పక్కనున్న జూనియర్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ముందుగా తెలియజేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అక్కడే విధి నిర్వహణ లో ఉన్న పోలీసులు విద్యార్థులను సంబంధిత ప రీక్షా కేంద్రాలకు తమ వాహనాల్లో తరలించారు.

నేడు పలమనేరులో గ్రీవెన్స్

నేడు పలమనేరులో గ్రీవెన్స్