
ప్రతి స్కూలుకు రెండు ఎస్జీటీ పోస్టులు కేటాయించాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా ప్రతి స్కూలుకు రెండు ఎస్జీటీ పోస్టులు కచ్చితంగా కేటాయించాలని స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరోత్తమరెడ్డి కోరారు. బుధవారం ఆయన పలు డిమాండ్ల పరిష్కారంపై విలేకరులతో మాట్లాడారు. ఉన్నత ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి 1:45 ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. డీఎస్సీలో నియమితులయ్యే టీచర్లను క్లస్టర్లో అదనపు టీచర్లుగా నియమించాలన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు విద్యార్థులతో నిమిత్తం లేకుండా హెచ్ఎం, అన్ని సబ్జెక్టులకు స్కూల్ అసిస్టెంట్స్, పీడీ పోస్టులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్స్ని తప్పనిసరిగా నియమించాలన్నారు. ఇటీవల డైట్, సమగ్రశిక్ష శాఖలో పనిచేస్తున్న సెక్టోరల్స్ను పూర్తి కాలం కాకముందే రీ ప్యాట్రియేషన్ చేయడం దారుణమన్నారు. అలాంటి టీచర్లకు రాబోయే బదిలీల్లో అనుమతి ఇస్తూ పాత పాఠశాల నుంచి సర్వీస్ లెక్కించాలని డిమాండ్ చేశారు. వైద్య ధ్రువీకరణ గతంలోకి, ఇప్పుడు ఇస్తున్న వాటికి ఎక్కువ వ్యత్యాసం ఉన్న వాటిని తిరిగి పునఃపరిశీలించాలన్నారు.