రూ. 11,000 కోట్ల సమీకరణపై కన్ను
న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో పబ్లిక్ ఇష్యూపై కన్నేసింది. జూలై 31కల్లా ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా రూ. 11,000 కోట్లు సమీకరించే వీలున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే క్విక్ కామర్స్ దిగ్గజాలు జొమాటో(ఎటర్నల్), స్విగ్గీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన నేపథ్యంలో జెప్టో ఐపీవోకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నెల మొదట్లో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి జెప్టోకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే.
కంపెనీ గోప్యతా విధానంలో దరఖాస్తు చేయడంతో మరోసారి అప్డేటెడ్ ప్రాస్పెక్టస్ను సెబీకి దాఖలు చేయవలసి ఉంటుంది. 2025 డిసెంబర్లో తొలుత సెబీకి ప్రాథమిక పత్రాలు సమర్పించింది. క్విక్ కామర్స్ విభాగంలో ప్రస్తుతం జెప్టో 61 పట్టణాలలో 1,255 డార్క్ స్టోర్లను నిర్వహిస్తోంది. 2025 అక్టోబర్లో కంపెనీ 45 కోట్ల డాలర్లు(రూ. 3,758 కోట్లు) సమీకరించింది. 2023 ఆగస్ట్లోనే యూనికార్న్ హోదా పొందిన కంపెనీ 7 బిలియన్ డాలర్ల విలువలో ఈ పెట్టుబడులు సమకూర్చుకుంది.


