‘ఆమె’ తీసుకున్న లోన్లు రూ.76 లక్షల కోట్లు | Womens Loan Portfolio Hits Rs 76 Lakh Crore | Sakshi
Sakshi News home page

‘ఆమె’ తీసుకున్న లోన్లు రూ.76 లక్షల కోట్లు

Apr 12 2026 7:25 AM | Updated on Apr 12 2026 7:59 AM

Womens Loan Portfolio Hits Rs 76 Lakh Crore

రూ.76 లక్షల కోట్లకు చేరిన వనితల రుణ పోర్ట్‌ఫోలియో

దేశీయ రుణ వ్యవస్థలో ఏకంగా 26 శాతానికి చేరిన వాటా

వినియోగ రుణాల నుంచి వ్యాపారాల విస్తరణ వైపు అడుగులు

రుణాల ‘గ్రాడ్యుయేషన్‌’లో సత్తా చాటుతున్న దక్షిణాది రాష్ట్రాలు

నీతి ఆయోగ్, సిబిల్, మైక్రోసేవ్‌ కన్సల్టింగ్‌ సంయుక్త నివేదికలో వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళా శక్తి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు చిన్నపాటి అవసరాల కోసం రుణాలు తీసుకోవడానికే పరిమితమైన వనితలు .. ఇప్పుడు వ్యాపార విస్తరణకు భారీ స్థాయిలో రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా మహిళల రుణ పోర్ట్‌ఫోలియో అక్షరాలా రూ.76 లక్షల కోట్లకు చేరిందని నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. వ్యవస్థలోని మొత్తం రుణాల్లో మహిళల వాటా ఏకంగా 26 శాతానికి ఎగబాకింది.

నీతి ఆయోగ్‌ సీఈఓ నిధి చిబ్బర్‌ న్యూఢిల్లీలో విడుదల చేసిన ‘ఫ్రమ్‌ బారోవర్స్‌ టు బిల్డర్స్‌: ఉమెన్‌ అండ్‌ ఇండియాస్‌ ఎవాల్వింగ్‌ క్రెడిట్‌ మార్కెట్‌‘ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్లాట్‌ఫామ్‌ (డబ్ల్యూఈపీ), ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్, మైక్రోసేవ్‌ కన్సల్టింగ్‌ (ఎంఎస్‌సీ) సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 2017 నుంచి చూస్తే మహిళలకు ఇచి్చన రుణాల పరిమాణం 4.8 రెట్లు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది. కేవలం రుణాలు పొందడం మాత్రమే కాకుండా, అధికారిక రుణ వ్యవస్థలో వారి భాగస్వామ్యం గుణాత్మకంగా మారుతోందని వెల్లడించింది.

పరుగులు పెడుతున్న వృద్ధి .. 
2017 డిసెంబర్‌ నుంచి 2025 డిసెంబర్‌ మధ్య కాలంలో క్రియాశీలక మహిళా రుణగ్రహీతల సంఖ్య 9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) నమోదు చేసింది. మహిళల్లో రుణ విస్తృతి 19 శాతం నుంచి 36 శాతానికి ఎగబాకింది. ప్రస్తుతం రుణ మార్కెట్‌లో 16 కోట్ల మంది యాక్టివ్‌ మహిళా రుణగ్రహీతలు ఉన్నారు. 2017లో రూ.16 లక్షల కోట్లుగా ఉన్న వీరి బకాయిలు, 2025 నాటికి రూ.76 లక్షల కోట్లకు చేరాయి. దేశంలో రుణ అర్హత కలిగిన 45 కోట్ల మంది మహిళలు ఉండగా, భవిష్యత్తులో ఈ మార్కెట్‌ మరింతగా విస్తరించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది.

మైక్రోఫైనాన్స్‌ నుంచి అప్‌గ్రేడ్‌ .. 
చిన్నపాటి మైక్రోఫైనాన్స్‌ రుణాలతో మొదలుపెట్టిన మహిళలు ఆ తర్వాత మంచి క్రెడిట్‌ హిస్టరీ సాధించి క్రమంగా రిటైల్, కమర్షియల్‌ రుణాల వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న మైక్రోఫైనాన్స్‌ రుణగ్రహీతల్లో 19 శాతం మంది రిటైల్‌ లేదా కమర్షియల్‌ లోన్స్‌ కలిగి ఉన్నారని నివేదిక స్పష్టం చేసింది. ఈ ’కస్టమర్‌ గ్రాడ్యుయేషన్‌’లోనూ దక్షిణాది రాష్ట్రాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. అత్యధికంగా తమిళనాడులో 27 శాతం మంది మహిళలు పెద్ద రుణాల వైపు అప్‌గ్రేడ్‌ అవ్వగా, కర్ణాటకలో ఈ రేటు 20 శాతంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో ఉన్న బలమైన క్రెడిట్‌ వ్యవస్థకు ఇది నిదర్శనమని నివేదిక స్పష్టం చేసింది.

డిజిటల్‌ అండతో సత్వర రుణాలు: కేరళ కేస్‌ స్టడీ 
డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (డీపీఐ), అధికారిక రుణ వ్యవస్థల కలయికతో ఆర్థిక భాగస్వామ్యం సులభతరమైందని నీతి ఆయోగ్‌ సీఈఓ నిధి చిబ్బర్‌ పేర్కొన్నారు. గుర్తింపు, చెల్లింపులు, అండర్‌రైటింగ్, లోన్‌ సరీ్వసింగ్‌ వంటి అంశాల్లో డిజిటలైజేషన్‌ పెరగడం వల్ల మహిళలకు రుణాలు త్వరగా మంజూరవుతున్నాయి. ప్రధాన వినియోగ విభాగాల్లో అదే రోజు రుణం మంజూరు (సేమ్‌–డే అప్రూవల్స్‌) ఏకంగా 45 శాతానికి చేరింది. గ్రామీణ మహిళా వ్యాపారుల డిజిటల్‌ ప్రయాణంపై అధ్యయనం చేసిన బృందం.. కేరళలో పలు ఆసక్తికర విషయాలు గుర్తించింది.

కేరళలోని గ్రామీణ మహిళా వ్యాపారుల్లో 38 శాతం మంది మహిళలు.. ’సమయాభావం’ తమ వ్యాపార వృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిందని వెల్లడించారు. ఇంటి బాధ్యతలు, వ్యాపారం రెండింటినీ చూసుకోవాల్సి రావడం వల్ల డిజిటల్‌ టూల్స్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామని వారు తెలిపారు. అయినా సరే కొందరు గ్రామీణ వ్యాపారులు వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, పింటెరెస్ట్‌ వంటి డిజిటల్‌ టూల్స్‌ ఉపయోగించి మార్కెటింగ్‌ చేసుకుంటున్న తీరును నివేదిక కేస్‌ స్టడీలుగా ప్రచురించింది. భవిష్యత్తులో ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ద్వారా తమ వ్యాపారాలను మరింత వృద్ధి చేసుకోవచ్చని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళలు అధికారిక ఫైనాన్షియల్‌ సిస్టమ్స్‌ వైపు మళ్లడం, వివిధ రుణ విభాగాల్లో చురుకుగా పాల్గొనడం భారత్‌ ఆర్థిక ముఖచిత్రంలో ఒక అర్థవంతమైన మార్పని డబ్ల్యూఈపీ మిషన్‌ డైరెక్టర్‌ అన్నా రాయ్‌ తెలిపారు. దాదాపు 16 కోట్ల మంది యాక్టివ్‌ మహిళా రుణగ్రహీతల డేటాతో పాటు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 161 మంది మహిళా నానో–ఎంటర్‌ప్రెన్యూర్ల ప్రైమరీ రీసెర్చ్‌ ఆధారంగా ఈ నివేదికను సమగ్రంగా రూపొందించారు.  

వ్యాపార రుణాల్లో దక్షిణాది హవా .. 
వ్యాపార అవసరాల కోసం రుణాలు తీసుకునే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2022–2025 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్‌ క్రెడిట్‌ వృద్ధి రేటు 17 శాతంగా ఉండగా, మహిళా వ్యాపారుల రుణాల వృద్ధి రేటు ఏకంగా 31 శాతంగా నమోదైంది. 2017 నుంచి చూస్తే వ్యాపార రుణాల బకాయిల పరిమాణం 7.5 రెట్లు పెరిగింది. ఈ విభాగంలో దక్షిణాది రాష్ట్రాలు బలమైన ముద్ర వేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కమర్షియల్‌ రుణాలు తీసుకున్న మహిళల్లో ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే 15 శాతం మంది ఉండగా, కర్ణాటక వాటా 9 శాతంగా ఉంది. అయితే వృద్ధి రేటు పరంగా చూస్తే ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్‌ (59%), ఉత్తరప్రదేశ్‌ (42%) వేగంగా దూసుకెళ్తున్నాయని నివేదిక తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement