వికసిత్‌ భారత్ సాధ్యం కాదా? భారత అభివృద్ధిపై బిగ్ రివీల్ | Viksit Bharat 2047 Target Realistic full details here | Sakshi
Sakshi News home page

వికసిత్‌ భారత్ సాధ్యం కాదా? భారత అభివృద్ధిపై బిగ్ రివీల్

Jul 8 2026 8:13 PM | Updated on Jul 8 2026 8:58 PM

Viksit Bharat 2047 Target Realistic full details here

‘‘వికసిత్ భారత్ 2047’’ లక్ష్యాన్ని పెట్టుకుంది ఇండియా. కానీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతం ఊహిస్తున్న లేదా ఇప్పటివరకు నమోదవుతున్న ఆర్థిక వృద్ధి రేటు సరిపోదని ఆర్థికవేత్త, రచయిత, కాలమిస్టు సుర్జిత్ భల్లా చెప్పారు. అంటే, మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న వేగంతో ఎదిగితే వికసిత్‌ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని, ఇంకా ఎక్కువ వృద్ధి అవసరమని అన్నారు. సుర్జిత్ భల్లా గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైమ్ సభ్యుడిగా పనిచేశారు. అలాగే, అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలకు కార్యనిర్వాహక డైరెక్టర్‌గా సేవలు అందించారు.

తాజాగా, సుర్జిత్ భల్లా ఓ ఇంటర్వ్యూలో.. భారత ఆర్థిక వ్యవస్థ, రూపాయి, చైనా, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, స్థూల దేశీయోత్పత్తి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి భారత్ చేపట్టాల్సిన సంస్కరణలపై మాట్లాడారు.  

‘‘భారత్‌లో 1991 నుంచి ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి గత 30 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ సగటున 6% వృద్ధి సాధించింది. కానీ తలసరి వృద్ధి (ఒక్కో వ్యక్తికి సగటు ఆదాయం పెరిగిన వేగం) మాత్రం దాదాపు 4.8% మాత్రమే. అంటే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం 6% పెరిగినా, జనాభా కూడా పెరగడం వల్ల ఒక్కో వ్యక్తికి చేరే ఆదాయం అంత వేగంగా పెరగలేదు. వికసిత్‌ భారత్ లక్ష్యాన్ని చేరాలంటే దేశ జీడీపీ వృద్ధి మాత్రమే కాదు, ఒక్కో వ్యక్తి ఆదాయం పెరిగే వేగం కూడా చాలా ఎక్కువగా ఉండాలి’’ అని వివరించారు. వికసిత్‌ భారత్ లక్ష్యం అంటే అధిక ఆదాయ దేశం లేదా ధనిక దేశంగా మారడం. దీనికి ప్రపంచ బ్యాంకు అధికారిక నిర్వచనం ఇచ్చింది. అంటే 2025 నుంచి 2047 వరకూ డాలర్ విలువలో తలసరి వృద్ధి 9% కంటే ఎక్కువ ఉండాలి.

చైనా ఇలా ఎదిగింది.. 
‘‘దీనిపై నేను ఒక పరిశోధనా పత్రం కూడా రాశాను. ప్రపంచంలో జరిగిన పరిణామాలను పోల్చాను. 2008-09లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చింది. 2011 నుంచి లేదా ఆ సంక్షోభం తర్వాత ప్రపంచ తలసరి వృద్ధి అన్ని దేశాల్లో గణనీయంగా తగ్గింది. అందుకే ఇప్పుడు లక్ష్యాన్ని చేరడం, 2011కు ముందు కంటే చాలా కష్టమైంది. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని చెబుతుంటాను. మనది ప్రపంచంతో అనుసంధానమైన దేశం. అందువల్ల ప్రపంచంలో జరిగే పరిణామాల ప్రభావం మనపై ఉంటుంది.

ప్రతి దేశంపైనా అదే ప్రభావం ఉంటుంది. అందుకే ప్రపంచ పరిస్థితులను చూడాలి. మనం బాగా ఎదిగాం. చైనా అసాధారణంగా ఎదిగింది. మిగతా దేశాలు ఎదగని సమయంలో అది అలా చేసింది. మారకపు విలువ విధానం, ఇతర వ్యవస్థల ద్వారా పరిస్థితిని తమకు అనుకూలంగా మలిచింది. ఆ విజయానికి వారికి అభినందనలు. కానీ, ఇప్పుడు పారదర్శకత తప్ప మరో మార్గం లేదు. అందుకే వికసిత్‌ భారత్ లక్ష్యాన్ని తీసుకుంటే, గత 30 ఏళ్లుగా మన స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 6% ఉంది. ఇది గొప్ప విజయమే. కానీ వికసిత్‌ భారత్ లక్ష్యాన్ని చేరాలంటే ఇంకా మెరుగైన వృద్ధి అవసరం. 6% లేదా 6% కంటే కొద్దిగా ఎక్కువ సరిపోదు. 9% కంటే ఎక్కువ వృద్ధి ఉంటేనే ఆ లక్ష్యాన్ని చేరగలం’’ అని సుర్జిత్ భల్లా వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement