ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తరువాత.. దేశంలో తమ కార్ల ధరలను తగ్గించే తొలి తయారీదారులలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) ఒకటిగా నిలుస్తోంది. ఒప్పందం ప్రకారం.. మొదటి సంవత్సరంలో యూకే నుంచి దిగుమతి అయ్యే పూర్తిస్థాయి యూనిట్లపై దిగుమతి సుంకాలను 110 శాతం నుంచి 30 శాతానికి తగ్గించడంతో.. భారతదేశంలోని రేంజ్ రోవర్ SV మోడళ్ల ధరలు తగ్గుతాయి.
ప్రస్తుతం రూ. 2.75 కోట్లుగా ఉన్న రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎస్వీ ఎడిషన్ ధర.. ఇండియా-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తరువాత రూ. 40 లక్షల తగ్గింపుతో రూ. 2.35 కోట్లకు చేరవచ్చు. రూ. 4.25 కోట్ల ధర కలిగిన రేంజ్ రోవర్ 4.4-లీటర్ పెట్రోల్ ఎస్వి ధర సుమారు రూ. 3.19 కోట్లకు తగ్గవచ్చు.
కేవలం యూకే నుంచి దిగుమతి చేసుకున్న ఎస్వీ మోడళ్లు ధరలు మాత్రమే తగ్గుతాయి. ఎందుకంటే రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్, వెలార్, డిస్కవరీ స్పోర్ట్ వంటి జనాదరణ పొందిన వేరియంట్లు పూణేలో స్థానికంగా అసెంబుల్ అవుతున్నాయి. దీనివల్ల వాటిపై ఇప్పటికే తక్కువ సుంకాలు ఉంటాయి. కాబట్టి వీటి ధరలు తగ్గే అవకాశం లేదు.


