థైరోకేర్‌- పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌.. దూకుడు | Thyrocare tech- Persistent sys jumps on Q2 results | Sakshi
Sakshi News home page

థైరోకేర్‌- పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌.. దూకుడు

Oct 26 2020 1:52 PM | Updated on Oct 26 2020 1:52 PM

Thyrocare tech- Persistent sys jumps on Q2 results - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ పనితీరును చూపనుందన్న అంచనాలతో హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ థైరోకేర్‌ టెక్నాలజీస్‌కు డిమాండ్‌ నెలకొంది. మరోపక్క ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఐటీ సేవల మధ్యస్థాయి కంపెనీ పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ కౌంటర్‌ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పతన మార్కెట్లోనూ ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తు‍న్నాయి. వివరాలు ఇలా..

థైరోకేర్‌ టెక్నాలజీస్‌
ఈ ఏడాది క్యూ2 ఫలితాలపై అంచనాలు పెరగడంతో డయాగ్నోస్టిక్‌ సేవల కంపెనీ థైరోకేర్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ జోరు చూపుతోంది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లి రూ. 1,165కు చేరింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. ప్రస్తుతం 6.6 శాతం జంప్‌చేసి రూ. 1,129 వద్ద ట్రేడవుతోంది. క్యూ2 ఫలితాల విడుదలకు వీలుగా బుధవారం(28న) బోర్డు సమావేశంకానున్నట్లు థైరోకేర్‌ టెక్నాలజీస్‌ వెల్లడించింది. ఇదేవిధంగా వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ చెల్లించే అంశంపైనా బోర్డు చర్చించనున్నట్లు తెలియజేసింది. కాగా.. గత నెల రోజుల్లో థైరోకేర్‌ టెక్నాలజీస్‌ షేరు 50 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇందుకు క్యూ1లో సాధించిన పటిష్ట ఫలితాలు దోహదపడినట్లు నిపుణులు చెబుతున్నారు.

పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌
ఈ ఏడాది క్యూ2లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 13 శాతంపైగా ఎగసి రూ. 102 కోట్లకు చేరినట్లు పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ పేర్కొంది. త్రైమాసిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం 1.7 శాతం పుంజుకుని రూ. 1008 కోట్లను తాకింది. ఇబిటా 13 శాతం బలపడి రూ. 166 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 1,220ను తాకింది. ప్రస్తుతం 2.4 శాతం లాభంతో రూ. 1,200 వద్ద ట్రేడవుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement