
దేశీయ స్టాక్మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మినహా చాలా దేశాలపై వాణిజ్య సుంకాలకు 90 రోజుల విరామం ప్రకటించిన తరువాత మిశ్రమ ఆసియా ధోరణుల మధ్య భారత ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీని చూశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 1310.11 పాయింట్లు (1.77 శాతం) లాభపడి 75,157.26 వద్ద స్థిరపడగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 429.40 పాయింట్లు లేదా 1.92 శాతం పెరిగి 22,828.55 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 షేర్లలో 47 షేర్లు లాభాల్లో ముగియగా, హిందాల్కో 6.52 శాతం, టాటా స్టీల్ 4.84 శాతం, జేఎస్డబ్ల్యూ స్టీల్ 4.81 శాతం, కోల్ ఇండియా 4.51 శాతం, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.43 శాతం లాభాలతో టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
విస్తృత మార్కెట్లలో బీఎస్ఈ మిడ్ క్యాప్ 1.84 శాతం, స్మాల్ క్యాప్ 3.04 శాతం పెరిగాయి. రంగాలవారీగా చూస్తే అన్ని రంగాల సూచీలు లాభాల్లో స్థిరపడ్డాయి. అత్యధికంగా నిఫ్టీ మెటల్, ఎనర్జీ, ఫార్మా, ఆటో, బ్యాంక్ 4.09 శాతం వరకు లాభపడ్డాయి.
అమెరికా వస్తువులపై సుంకాలను శనివారం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు చైనా ప్రకటించిన నేపథ్యంలో వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరగడంతో జపాన్ కు చెందిన నిక్కీ 225, దక్షిణ కొరియాకు చెందిన కోస్పీ, సింగపూర్ కు చెందిన స్ట్రెయిట్స్ టైమ్స్ సహా ఆసియా మార్కెట్ల సూచీలు నష్టాలలో ముగిశాయి. అంతకు ముందు చైనా దిగుమతులపై సుంకాన్ని 145 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు.