నేడు ఒడిదొడుకుల ఓపెనింగ్?!
లాభనష్టాలకు లోనవుతున్న ఎస్జీఎక్స్ నిఫ్టీ
సోమవారం యూరోపియన్ మార్కెట్ల జోరు
ప్రస్తుతం ఆసియా మార్కెట్లు లాభాల్లో
అమ్మకాల బాటలోనే దేశ, విదేశీ ఇన్వెస్టర్లు
నిఫ్టీకి 11,407-11,459 వద్ద రెసిస్టెన్స్!
దేశీ స్టాక్ మార్కెట్లు నేడు(8న) ఆటుపోట్ల మధ్య ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8 ప్రాంతంలో 31 పాయింట్లు పుంజుకున్న ఎస్జీఎక్స్ నిఫ్టీ 8.25 ప్రాంతంలో 11 పాయింట్లు తక్కువగా 11,379 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ సెప్టెంబర్ ఫ్యూచర్స్ 11,390 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. లేబర్ డే సందర్భంగా సోమవారం యూఎస్ మార్కెట్లకు సెలవుకాగా.. యూరోపియన్ మార్కెట్లు 2 శాతం ఎగశాయి. ప్రస్తుతం ఆసియాలోనూ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. యూఎస్ డోజోన్స్ ఫ్యూచర్స్ 200 పాయింట్లు ఎగసింది. అయితే జీడీపీ అనూహ్య క్షీణత, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల కారణంగా దేశీ స్టాక్ మార్కెట్లు నేడు కూడా కొంతమేర ఒడిదొడుకులకు లోను కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్వల్ప లాభాలతో సరి
సోమవారం నేలచూపులతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు ఆద్యంతం ఆటుపోట్ల మధ్య కదిలాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 60 పాయింట్లు బలపడి 38,417 వద్ద నిలవగా.. నిఫ్టీ 21 పాయింట్లు పుంజుకుని 11,355 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 38,520 వద్ద గరిష్టాన్ని తాకగా, 38,061 దిగువన కనిష్టాన్నీ చేరింది. నిఫ్టీ సైతం 1,381- 11,252 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 11,277 పాయింట్ల వద్ద, తదుపరి 11,200 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,407 పాయింట్ల వద్ద, ఆపై 11,459 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 22,738 పాయింట్ల వద్ద, తదుపరి 22,531 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 23,131 పాయింట్ల వద్ద, తదుపరి 23,316 స్థాయిలో బ్యాంక్ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.
అమ్మకాల బాటలో
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కేవలం రూ. 7 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 816 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. శుక్రవారం సైతం ఎఫ్పీఐలు రూ. 1,889 కోట్లు, డీఐఐలు రూ. 457 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే.
మరిన్ని వార్తలు