టెన్షన్‌.. టెన్షన్‌.. 700 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌

Sensex Falls Over 800 Points From December 13 High Nifty Also Plunged - Sakshi

ముంబై: ఇన్వెస్టర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది దేశీ స్టాక్‌ మార్కెట్‌. మార్కెల్‌లో బుల్‌ , బేర్‌లు హోరాహోరీగా పోటీ పడుతుండటంతో ఏ క్షణం జరుగుతుందో అనే గుబులు ఇన్వెస్టర్లలో మొదలైంది. సోమవారం ఉదయం నుంచి బుల్‌ జోరు కొనసాగగా మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఒక్కసారిగా బేర్‌ పంజా విసిరింది. అంతే గంట వ్యవధిలోనే సెన్సెక్స్‌ 700ల పాయింట్లకు పైగా నష్టపోయింది.

800ల పాయింట్లకు పైగా
సోమవారం ఉదయం బీఎస్‌ఈ సెన్సెన్స్‌ 59,103 పాయింట్ల దగ్గర మొదలైంది. ఆ వెంటనే నిలకడగా కదలాడుతూ వరుసగా పాయింట్లు పొందుతూ 59,203 పాయింట్లకు చేరుకుంది. మరోసారి మార్కెట్‌లో బుల్‌ ర్యాలీ కొనసాగుతుందనే నమ్మకం ఇన్వెస్టర్లలో కలుగుతుండగానే ‘బేర్‌’ ట్రెండ్‌ ఎదురైంది. మరోసారి ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడానికి ఆసక్తి చూపించారు. ఫలితంగా మధ్యాహ్నం12:30 గంటల నుంచి 1 గంట వరకు కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలోనే ఈ గరిష్టంతో పోల్చితే 835 పాయింట్లు, నిన్నటి ముగింపుతో పోల్చితే 417 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్‌ ముగిసేలోపు మరేం మార్పులో చోటు చేసుకుంటాయో అనే ఆందోళన ఇన్వెస్టర్లలో మొదలైంది. మరోవైపు పాజిటివ్‌ నోట్‌లో ప్రారంభించిన నిఫ్టీ సైతం ఒడిదుడుకులకు లోనైంది. మధ్యాహ ‍్నం 1 గంట సమయానికి 92 పాయిం‍ట్లు నష్టపోయి 17,419 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. సాయంత్రంలోపైనా మార్కెట్‌ కోలుకుంటుందా లేక ఇవే నష్టాలు కొనసాగుతాయా ? అనే టెన్షన్‌ ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది.

సెకండ్‌ వేవ్‌ తర్వాత
కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత మార్కెట్లో బుల్‌ ర్యాలీ కొనసాగింది. జూన్‌ నుంచి అక్టోబరు రెండో వారం వరకు ఈ ర్యాలీ కొనసాగడంతో సెన్సెక్స్‌ 62 వేలు, నిఫ్టీ 18 వేల పాయింట్ల గరిష్టాలను క్రాస్‌ చేశాయి. ఆ తర్వాత మార్కెట్‌ కరెక‌్షన్‌ కొనసాగడంతో సెన్సెక్స్‌ 57 వేల దగ్గర, నిఫ్టీ 16వేలకు పడిపోయాయి. తిరిగి మార్కెట్‌ పుంజుకునే క్రమంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగు చూసింది. చైనా, అమెరికాల మధ్య అంతర్జాతీయ సంబంధాలు వేడెక్కాయి. దీంతో మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. 

ఒత్తిడిలో
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసస్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌ షేర్లు సోమవారం మధ్యాహ్నం నుంచి తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top