sensex above 51000 nifty hits 15000 - Sakshi
Sakshi News home page

అదే జోష్‌, అదే హుషారు : పరుగే పరుగు

Feb 5 2021 9:56 AM | Updated on Feb 5 2021 12:29 PM

Sensex above 51000, Nifty hits 15000  - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది.బడ్జెట్‌ బూస్ట్‌కు తోడు,అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల సపోర్ట్‌తో దేశీయ మార్కెట్‌ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్‌ 51వేల మార్కును అధిగమించింది. అటు నిఫ్టీ 15 వేల మార్కును క్రాస్‌ చేసింది. 450 పాయింట్లు పెరిగి సెన్సెక్స్ తొలిసారిగా 51,031, నిఫ్టీ 15,004ని టచ్‌ చేసింది. ఆర్‌బీఐ పాలసీ రివ్యూ ప్రకటించనున్న నేపథ్యంలో బ్యాంకింగ్‌ షేర్లు ర్యాలీ అవుతున్నాయి. ఫలితంగా బ్యాంక్‌ నిఫ్టీ కూడా 36వేల మార్కును అధిగమించింది. సెన్సెక్స్‌ ప్రస్తుతం 356 పాయింట్ల లాభంతో 50986 వద్ద, నిఫ్టీ 94  పాయింట్ల లాభంతో 14990 వద్ద కొనసాగుతోంది. అటుబ్యాంక్‌ నిఫ్టీ 900 పాయింట్ల లాభంతో 36 వేల ఎగువన ట్రేడవుతోంది.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌లు మోస్ట్‌ యాక్టివ్‌గా ట్రేడవుతోన్నాయి.  3వ క్వార్టర్‌ ఫలితాల జోష్‌తో ఎస్‌బీఐ భారీగా లాభ పడుతోంది. ఇండస్ఇండ్‌ బ్యాంక్‌ , కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌  ఓఎన్‌జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. ఎంఅండ్‌ఎం, టాటా మోటార్స్‌, పవర్‌ గ్రిడ్‌ , కోల్ ఇండియా, యూపీఎల్‌ నష్టపోతున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్ నేతృత్వంలోని ద్రవ్య విధాన కమిటీ నేడు (2021 ఫిబ్రవరి 5) నిర్ణయాన్ని ప్రకటించనుంది. అటు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఫైజర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆల్కమ్ లాబొరేటరీస్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, అశోక బిల్డ్‌కాన్‌ బ్రిటానియా, కాడిలాహెల్త్‌కేర్ క్యూ3 ఫలితాలు ప్రకటించ నున్నాయి. మరోవైపు వరుస లాభాలతో ఇన్వెస్టర్ల సంపద ఇప్పటికే  200లక్షల కోట్ల మార్క్‌ను దాటేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement