దేశంలో ఇంధన పొదుపును ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునకు కార్పొరేట్, ప్రభుత్వ రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. ప్రధాని విజ్ఞప్తి చేసిన పక్షం రోజుల వ్యవధిలోనే, ప్రముఖ మార్కెట్ రెగ్యులేటర్ ‘సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ (SEBI) తమ జూనియర్ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ (WFH) సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, గ్రేడ్ 'ఎ' నుండి గ్రేడ్ 'సి' వరకు ఉన్న ఉద్యోగులకు వారానికి ఒక రోజు ఇంటి నుండి పనిచేసే అవకాశాన్ని సెబీ కల్పించినట్లు 'ఎన్డీటీవీ ప్రాఫిట్' పేర్కొంది. ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన అంతర్జాతీయ ఇంధన ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, తాత్కాలిక చర్యల్లో భాగంగా సెబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంధన పరిరక్షణ చొరవలో భాగంగా సెబీ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో భాగంగా అంతర్గతంగా నిర్వహించే పలు కార్యక్రమాలను వాయిదా వేయాలని భావిస్తోంది. ఉద్యోగుల అనవసర ప్రయాణాలను, హోటల్ బస ఖర్చులను గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
కేవలం ప్రభుత్వ రంగానికి చెందిన సెబీ మాత్రమే కాకుండా, దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలు సైతం ప్రధాని పిలుపునకు మద్దతుగా నిలుస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank) ట్రెజరీ కార్యకలాపాలు, క్రెడిట్ అండర్ రైటింగ్, రిస్క్ మేనేజ్మెంట్, ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ సేవలు వంటి కీలక విభాగాల్లోని ఎంపిక చేసిన సిబ్బందికి వారానికి రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించింది. అలాగే హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ (HDFC Securities) కూడా ఇప్పటికే తమ ఉద్యోగుల కోసం 'హైబ్రిడ్ వర్కింగ్ మోడల్'ను అమలుల్లోకి తెచ్చింది.


