జాబితాలో కృష్ణా బిల్డ్స్పేస్ రోడెక్ ఫార్మా, రెన్నీ స్ట్రిప్స్
తాజాగా సెబీ గ్రీన్సిగ్నల్
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూ చేపట్టేందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాబితాలో రోడెక్ ఫార్మా, రెన్నీ స్ట్రిప్స్, కృష్ణా బిల్డ్స్పేస్ చేరాయి. లిస్టింగ్కు అనుమతించమంటూ రెన్నీ స్ట్రిప్స్ 2025 డిసెంబర్లో, రోడెక్ ఫార్మా, కృష్ణా బిల్డ్స్పేస్ 2026 జనవరిలో సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి.
ఓఎఫ్ఎస్ ద్వారా
వెటర్నరీ ఫార్మా ప్రొడక్టుల కంపెనీ రోడెక్ ఫార్మా పబ్లిక్ ఇష్యూలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) బాటలో సాగనుంది. ప్రమోటర్ ముకేష్ కుమార్ గుప్తా 56.5 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో నిధులు కంపెనీకికాకుండా ప్రమోటర్లకు చేరనున్నాయి. 1997లో ఏర్పాటైన కంపెనీ జంతు ఆహార సంబంధ(యానిమల్ ఫీడ్) సప్లిమెంట్స్ తయారీతోపాటు వెటర్నరీ ఫార్మాస్యూటికల్ ప్రొడక్టుల మార్కెటింగ్ చేపడుతోంది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో తయారీ ప్లాంటు కలిగి ఉంది.
ఈక్విటీ జారీసహా..
వివిధ పరిశ్రమలలో వినియోగించే మైల్డ్ స్టీల్ బిల్లెట్స్సహా.. విభిన్న స్ట్రక్చురల్ ప్రొడక్టులు రూపొందించే రెన్నీ స్ట్రిప్స్ ఐపీవోలో భాగంగా రూ. 300 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.2 కోట్ల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను లూధియానాలో స్కఫోల్డింగ్, ఫామ్వర్క్ సిస్టమ్స్, ఈఆర్డబ్ల్యూ పైపులు, ట్యూబుల తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది. అంతేకాకుండా ప్రస్తుత ప్లాంట్ల ఆధునీకరణ, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు సైతం కేటాయించనుంది.
నిర్మాణ రంగ సంస్థ
నిర్మాణ రంగ గుజరాత్ కంపెనీ కృష్ణా బిల్డ్స్పేస్ పబ్లిక్ ఇష్యూలో భాగంగా 90 లక్షల షేర్లను తాజాగా జారీ చేయనుంది. వీటితోపాటు 9 లక్షల షేర్లను ప్రమోటర్లు విక్రయానికి ఉంచనున్నారు. 1995లో ఏర్పాటైన కంపెనీ కాంట్రాక్టింగ్, బిల్డింగ్ సరీ్వసులందిస్తోంది. ఐపీవో చేపట్టడం ద్వారా మూడు కంపెనీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్కానున్నాయి.


