ముంబై: నకిలీ అప్లికేషన్లు(యాప్స్)తో స్టాక్ మార్కెట్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. దీంతో మదుపరుల రక్షణార్థం గూగుల్, మెటా తదితర టెక్నాలజీ దిగ్గజాలు ఆర్థిక నియంత్రణ సంస్థలతో కలసి పనిచేయాలని సూచించారు.
త్వరలోనే మరోసారి స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల ప్రవాహానికి వీలున్నట్లు అంచనా వేశారు. వెరసి మార్కెట్లో వాటాదారులందరికీ రక్షణ కల్పింపంచవలసి ఉన్నట్లు పేర్కొన్నారు. దేశీయంగా యూనిక్ ఇన్వెస్టర్ల సంఖ్య 14 కోట్లను తాకినట్లు వెల్లడించారు. మరోపక్క మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) 423 లక్షల కోట్లకు చేరినట్లు తెలియజేశారు. వెరిఫైడ్ యాప్ లేబుల్ను గూగుల్ ప్రవేశపెట్టిన సందర్భంగా పాండే ఈ అంశాలను ప్రస్తావించారు.


