దేశంలో ఆఫీస్‌ స్పేస్‌ విస్తరణ.. కారణం.. | Reasons For Office Transactions Scales Record High With 19mn sq ft, Check Out The Details | Sakshi
Sakshi News home page

దేశంలో ఆఫీస్‌ స్పేస్‌ విస్తరణ.. కారణం..

Oct 4 2024 9:53 AM | Updated on Oct 4 2024 12:18 PM

reasons for Office Transactions Scales Record High

దేశీయంగా మూడో త్రైమాసికంలో ప్రధానం నగరాల్లోని కంపెనీలు 19 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్‌ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. 2023లో ఇదే సమయంలో అద్దెకు తీసుకున్న 16.1 మిలియన్ చదరపు అడుగుల స్థలంతో పోలిస్తే ఈసారి 18 శాతం పెరుగుదల నమోదైందని నివేదికలో పేర్కొంది. 2024 సంవత్సరం మొదటి 9 నెలల్లో 53.7 మిలియన్ చదరపు అడుగుల మేర ఆఫీస్‌ స్థలాన్ని లీజ్‌కు తీసుకున్నట్లు నైట్‌ ఫ్రాంక్‌ నివేదించింది.

నివేదికలోని వివరాల ప్రకారం..2024 క్యూ3లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌లు (జీసీసీ) 7.1 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఆఫీస్ స్పేస్‌కు మార్కెట్‌లో డిమాండ్ భారీగా పెరుగుతోంది. జీసీసీల వృద్ధి అందుకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. దాంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. దేశంలో 2024 క్యూ3లో బెంగళూరు నగరం 5.3 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్‌ స్పేస్‌ అద్దెతో మొదటిస్థానంలో నిలిచింది. ఎన్‌సీఆర్‌ ఢిల్లీ 3.2, ముంబయి 2.6, పుణె 2.6, చెన్నై 2.6, హైదరాబాద్‌లో 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్‌ స్పేస్‌ను లీస్‌కు తీసుకున్నారు. కొత్తగా హైదరాబాద్‌ నగరం 4.2, పుణె 2.7, బెంగళూరు 2.5, ఎన్‌సీఆర్‌ ఢిల్లీ 0.9, ముంబయి 0.8  మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్‌ స్థలాన్ని నిర్మించాయి.

ఇదీ చదవండి: మార్కెట్‌ కల్లోలానికి కారణాలు

దేశంలోని ఐటీ కంపెనీలు, ఇతర టెక్‌ సర్వీస్‌లు అందించే స​ంస్థలు కొంతకాలంగా అనుసరిస్తున్న వర్క్‌ఫ్రంహోం, హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌కు స్వస్తి పలుకుతున్నాయి. క్రమంగా ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీస్‌ నుంచే పని చేయాలని మెయిళ్లు పంపుతున్నాయి. దాంతో కరోనా సమయం నుంచి ఇంటి వద్ద పనిచేస్తున్నవారు తిరిగి కార్యాలయాలకు వస్తున్నారు. నిత్యం సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. దాంతో గడిచిన 3-4 ఏళ్ల నుంచి కంపెనీల్లోని మానవ వనరులు పెరిగాయి. తిరిగి అందరూ ఆఫీస్‌కు వస్తుండడంతో అందుకు సరిపడా స్పేస్‌ను లీజ్‌కు తీసుకుంటున్నాయి. దేశీయంగా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఫలితంగా ప్రధాన నగరాల్లో జీసీసీల సంఖ్య పెరుగుతోంది. వాటిలోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చేరుతుండడంతో అద్దె స్థలం పెరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement