మార్చి త్రైమాసికంలో అధిక లావాదేవీలు
కానీ 63 శాతం తగ్గిన లావాదేవీల విలువ
గ్రాంట్ థార్న్టన్ నివేదిక విడుదల
రియల్ ఎస్టేట్ మార్కెట్లో జోరు తగ్గింది. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 763 మిలియన్ డాలర్ల విలువైన లావాదేవీలు (రూ.7,096 కోట్లు) జరిగాయి. అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 63 శాతం తగ్గినట్టు కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ భారత్ ప్రకటించింది. ‘‘2026 క్యూ1లో (జనవరి–మార్చి) రియల్ ఎస్టేట్లో 32 లావాదేవీలు జరిగాయి. రెండో అత్యధిక త్రైమాసిక లావాదేవీల రికార్డు ఇది. అయితే మొత్తం లావాదేవీల విలువ 63 శాతం తగ్గి 763 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. పెద్ద సైజు లావాదేవీలు లేకపోవడం, చిన్న, మధ్యస్థ లావాదేవీల వైపు మొగ్గు చూపడం ఇందుకు దారితీసింది’’అని ఈ నివేదిక వెల్లడించింది. 2023 సంవత్సరం చివరి త్రైమాసికం తర్వాత లావాదేవీల విలువ అతి తక్కువ నమోదు కావడం మళ్లీ ఇదే.
పీఈ లావాదేవీలే ఎక్కువ..
ప్రైవేటు ఈక్విటీ (పీఈ) లావాదేవీల విలువ అంతక్రితం త్రైమాసికంతో పోల్చి చూస్తే 71 శాతం తగ్గి 458 మిలియన్ డాలర్లుగా ఉంది. విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) లావాదేవీల విలువ 38 శాతం తగ్గి 305 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్మెంట్ (క్యూఐపీ)లలో ఒక్క ఇష్యూ నమోదు కాలేదు. వాణిజ్య ఆస్తులు, ముఖ్యంగా ఆఫీస్, రిటైల్ ప్లాట్ఫామ్ల పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి కనిపించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు, స్థూల ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు ఆస్తుల వారీ పనితీరును, నిర్వహణను చూస్తున్నట్టు గ్రాంట్ థార్న్టన్ భారత్ పార్ట్నర్ షబాలా షిండే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్ ఆఫర్


