Ola Electric: ఇక మార్కెట్లోకి తక్కువ ధరలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్

ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ వచ్చే ఏడాది నుంచి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయనున్నట్లు సీఈఓ భవిష్ అగర్వాల్ ధృవీకరించారు. ఎలక్ట్రిక్ బైక్, చౌకైన ఈ-స్కూటర్లపై కంపెనీ దృష్టి సారించినట్లు ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన ఒక ఆర్టికల్ను రీట్వీట్ చేస్తూ ‘అవును, వచ్చే సంవత్సరం’ అని పేర్కొన్నారు. గతంలో ఆయన తన బ్లాగ్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. తమ కంపెనీ ఉత్పత్తులను ఈ-మోటార్ సైకిళ్ల నుంచి ఈ-కార్ల వరకు విస్తరించే అవకాశం ఉందని తెలిపారు.
ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లు, కార్లను అభివృద్ధి చేసే ప్రణాళికలను వేగవంతం చేయడానికి 200 మిలియన్ల డాలర్ల(సుమారు రూ.1500 కోట్ల)ను ఓలా ఎలక్ట్రిక్ సేకరించింది. ‘మిషన్ ఎలక్ట్రిక్’ను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నిధులను సమీకరించినట్లు భవేష్ పేర్కొన్నారు. 2025 నాటికి దేశ రోడ్లపై పెట్రోల్ తో నడిచే ద్విచక్ర వాహనం ఉండదని కంపెనీ అంచనా వేస్తుంది. ఈవీ స్టార్టప్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్1, ఎస్1 ప్రోను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించింది. ఈ మోడల్ ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, అహ్మదాబాద్ వంటి నగరాల్లో టెస్ట్ డ్రైవ్ కోసం అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ వాహనాల డెలివరీలు కూడా మొదలుపెట్టనుంది. డిసెంబర్లో రెండో విడత విక్రయాలను చేపట్టనుంది.
Yes next year👍🏼 https://t.co/dLT1n5qdRp
— Bhavish Aggarwal (@bhash) November 13, 2021
(చదవండి: టెస్లాను వెంటాడుతున్న కష్టాలు)