న్యూఢిల్లీ: ప్రధాన నగరాల్లో కార్యాలయ స్థలాలకు డిమాండ్ పెరుగుతుండడంతో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ఎనిమిది ప్రముఖ నగరాల్లో జనవరి–మార్చి త్రైమాసికంలో కార్యాలయ అద్దెలు 2–15 శాతం మధ్య పెరిగినట్టు (క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చి చూసినప్పుడు) రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ఫ్రాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. ముఖ్యంగా బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్లోని ప్రముఖ ప్రాంతాల్లో మొదటిసారి చదరపు అడుగుకు (ఎస్ఎఫ్టీ) నెలవారీ అద్దె రూ.100 మార్క్ను అధిగమించింది. ముంబైలో ఇప్పటికే నెలవారీ ఆఫీస్ అద్దెలు రూ.100కు పైనే ఉండడం గమనార్హం.
నగరాల వారీ డేటా..
హైదరాబాద్లో కార్యాలయ స్థలాల నెలవారీ అద్దె చదరపు అడుగుకు 8 శాతం ఎగిసింది. రూ.77.5కు చేరింది.
చెన్నైలోనూ 8 శాతం పెరుగుదలతో రూ.74.50గా నమోదైంది.
అత్యధికంగా ఢిల్లీ ఎన్సీఆర్, కోల్కతాలో కార్యాలయ స్థలాల (ఆఫీస్) అద్దెలు మార్చి త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 15 శాతం పెరిగాయి.
ఢిల్లీ ఎన్సీఆర్లో నెలవారీ ఆఫీస్ అద్దెలు 15 శాతం పెరిగాయి. చదరపు అడుగునకు రూ.105కి చేరాయి.
ముంబైలో నెలవారీ ఆఫీస్ అద్దెలు 6 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.125 మార్క్నకు చేరాయి.
బెంగళూరులో చదరపు అడుగు నెలవారీ అద్దె రూ.100.6కు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 7 శాతం పెరిగింది.
పుణెలో 5 శాతం పెరిగి ఎస్ఎఫ్టీ అద్దె రూ.80.9కు చేరింది.
కోల్కతాలో ఆఫీస్ అద్దెలు 15 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.48.30కి చేరాయి.
అహ్మదాబాద్లో నెలవాసీ సగటు ఆఫీస్ స్పేస్ అద్దె ధర 2 శాతం పెరిగి ఎస్ఎఫ్టీకి రూ.45గా ఉంది.
డిమాండ్ ఎక్కువ.. సరఫరా తక్కువ
2026 మొదటి త్రైమాసికంలో ఎనిమిది నగరాల్లో రికార్డు స్థాయిలో 2.99 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్థలాల లీజు లావాదేవీలు నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 6 శాతం పెరుగుదల కనిపిస్తోంది. కానీ, ఇదే కాలంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన స్థలాలు 1.4 కోట్ల చదరపు అడుగులు మాత్రమే. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే సరఫరా సైతం 154 శాతం పెరిగింది. కానీ, డిమాండ్కు తగ్గ సరఫరా రానట్టు నైట్ఫ్రాంక్ నివేదిక తెలిపింది.
కీలక మార్కెట్లలో సరఫరా తగ్గడంతో అద్దెలు స్థిరంగా పెరిగేందుకు దారితీసినట్టు వెల్లడించింది. డెవలపర్లు ఆఫీస్ ప్రాజెక్టుల కంటే నివాస గృహాలవైపు మొగ్గు చూపడం డిమాండ్కు తగ్గ సరఫరా రాకపోవడానికి కారణమని వివరించింది. ‘‘2021 నుంచి ఆపీస్ స్థలాలకు డిమాండ్, సరఫరా మధ్య అంతరం కొనసాగుతోంది. దీంతో సరఫరా పరిస్థితులు కఠినంగా మారాయి. 2021లో 17.2 శాతం మేర కార్యాలయ స్థలాలు ఖాళీగా ఉంటే, ఇప్పుడు 13.9 శాతానికి తగ్గిపోయింది. కార్యాలయ స్థలాల అభివృద్ధికి భారీ పెట్టుబడులు అవసరం కావడంతో, కేవలం కొన్ని సంస్థలు మాత్రమే ఈ రంగం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి’’ నైట్ఫ్రాంక్ నివేదిక వివరించింది.


