మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్‌.. మార్కెట్లు పుంజుకునే చాన్స్‌ | Nifty, Sensex performance during Maharashtra Assembly Results | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్‌.. మార్కెట్లు పుంజుకునే చాన్స్‌

Nov 25 2024 6:32 AM | Updated on Nov 25 2024 8:00 AM

Nifty, Sensex performance during Maharashtra Assembly Results

ద్వితీయార్ధంలో అమ్మకాలు 

ప్రపంచ అనిశ్చితుల ప్రభావం 

గణాంకాలకూ ప్రాధాన్యం 

ఈ వారం ట్రెండ్‌పై నిపుణులు 

ముంబై: ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లపై మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు, ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక గణాంకాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి శాసించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు తెలియజేశారు. దీంతో తొలి రోజు మార్కెట్లు సానుకూలంగా ప్రారంభంకావచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా అంచనా వేశారు. దీనికితోడు గత వారం చివర్లో మార్కెట్లు హైజంప్‌ చేయడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషించారు. 

కొద్ది వారాలుగా కరెక్షన్‌ బాటలో సాగుతున్న మార్కెట్లలో శుక్రవారం రిలీఫ్‌ ర్యాలీకి తెరలేచింది. గత ఐదు నెలల్లోలేని విధంగా సెన్సెక్స్‌ 1,961 పాయింట్లు దూసుకెళ్లగా.. నిఫ్టీ 557 పాయింట్లు ఎగసిన సంగతి తెలిసిందే. అయితే తదుపరి దశలో పలు దేశ, విదేశీ అంశాలు ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సరీ్వసెస్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా భావిస్తున్నారు. జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమి విజయం సాధించడం, రష్యా– ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ భయాలు పెరగడం వంటి అంశాలను ఈ సందర్భంగా ఖేమ్కా, మీనా ప్రస్తావించారు.  

జీడీపీ.. కీలకం 
బుధవారం(27న) త్రైమాసిక ప్రాతిపదికన జులై–సెపె్టంబర్‌(క్యూ3)కు యూఎస్‌ జీడీపీ గణాంకాల రెండో అంచనా వెలువడనుంది. ముందస్తు అంచనాలో వార్షికంగా క్యూ3లో 2.8 శాతం వృద్ధిని సాధించింది. ఈ బాటలో ఫెడరల్‌ రిజర్వ్‌ మినిట్స్‌ విడుదల కానున్నాయి. ఎఫ్‌వోఎంసీ గత పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 4.5–4.75 శాతంగా అమలవుతున్నాయి. ఈ నిర్ణయాల వెనుక అంశాలను మినిట్స్‌ వెల్లడించనున్నాయి. అక్టోబర్‌ నెలకు కీలక పీసీఈ ధరల గణాంకాలు విడుదలకానుండగా.. 29న నవంబర్‌ నెలకు యూరో ప్రాంత ద్రవ్యోల్బణ అంచనాలు తెలియనున్నాయి. ఇక దేశీయంగా జులై–సెపె్టంబర్‌(క్యూ2)లో ఆర్థిక వ్యవస్థ పనితీరు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్‌–జూన్‌(క్యూ1)లో జీడీపీ 6.7 శాతం పుంజుకుంది. ఇదేవిధంగా ప్రభుత్వం అక్టోబర్‌ నెలకు మౌలిక రంగ పురోగతి గణాంకాలు ప్రకటించనుంది. సెపె్టంబర్‌లో మౌలిక రంగం 2 శాతం బలపడింది. 

ఇతర ప్రభావిత అంశాలు  
ప్రపంచస్థాయిలో రాజకీయ, భౌగోళిక ఆందోళనలు, దీంతో పెరుగుతున్న ముడిచమురు ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారితీస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు వివరించారు. మరోవైపు ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలపడుతుండటంతో రూపాయి నీరసిస్తున్న విషయం విదితమే. వీటికితోడు యూఎస్‌ ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్‌ మెరుగుపడుతుండటంతో కొద్ది రోజులుగా విదేశీ పెట్టుబడులు వెనక్కి మళ్లుతున్నాయి. ఈ అంశాలు దేశీయంగా మార్కెట్ల ట్రెండ్‌ను నిర్దేశించే వీలున్నట్లు మీనా, ఖేమ్కా తెలియజేశారు. కాగా.. దేశీయంగా మౌలిక రంగ అభివృద్ధి, రాజకీయ సుస్థిరతకు మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు దోహదపడగలవని మాస్టర్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ డైరెక్టర్‌ పల్క అరోరా చోప్రా పేర్కొన్నారు. ఇది స్టాక్‌ మార్కెట్లకు బలిమిని ఇవ్వగలదని అభిప్రాయపడ్డారు. అయితే వారాంతాన వెలువడను న్న జీడీపీ, ‘మౌలిక’ గణాంకాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా పేర్కొన్నారు.  

గత వారమిలా 
దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ అమ్మకాల నుంచి గత వారం చివర్లో యూటర్న్‌ తీసుకున్నాయి. దీంతో గత వారం మార్కెట్లు నికరంగా లాభాలతో ముగిశాయి. ఆటుపోట్ల మధ్య సెన్సెక్స్‌ 1,537 పాయింట్లు(2 శాతం) జమ చేసుకుని 79,117 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం 375 పాయింట్లు(1.6 శాతం) బలపడి 23,907 వద్ద స్థిరపడింది. వెరసి సెన్సెక్స్‌ 79,000ను అధిగమించగా.. నిఫ్టీ 24,000 పాయింట్లకు చేరువైంది. అయితే బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 1.7% లాభపడగా.. స్మాల్‌ క్యాప్‌ 0.5 శాతమే పుంజుకుంది.

అమ్మకాలకే ఎఫ్‌పీఐల మొగ్గు 
నవంబర్‌లో రూ. 26,533 కోట్లు 
ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాలకే ప్రాధాన్యత ఇస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఈ నెలలోనూ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. వెరసి నవంబర్‌లో ఇప్పటి(22)వరకూ నికరంగా రూ. 26,533 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఇందుకు ప్రధానంగా చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీ కార్పొరేట్‌ క్యూ2 ఫలితాలు నిరాశపరచడం, ప్రపంచ అనిశి్చతులు, డాలరు బలపడటం వంటి అంశాలు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే అక్టోబర్‌లో నమోదైన విక్రయాలతో పోలిస్తే అమ్మకాల తీవ్రత తగ్గినట్లు తెలియజేశారు. అక్టోబర్‌లో ఎఫ్‌పీఐలు నికరంగా 11.2 బిలియన్‌ డాలర్ల(రూ. 94,107 కోట్లు) పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు సెపె్టంబర్‌లో అంతక్రితం 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడం గమనార్హం! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement