భారతదేశంలో అత్యంత సంపన్నుడైన అంబానీ గురించి, వారు నివసించే భవనం యాంటిలియా గురించి చాలా విషయాలు తెలిసుంటాయి. కానీ సుమారు రూ. 15,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఈ నివాసంలో ఒక్క ఔట్ డోర్ ఏసీ కూడా లేకపోవడం గమనార్హం. బహుశా ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకీ అంతపెద్ద భవనంలో ఔట్ డోర్ ఏసీ లేకపోవడానికి కారణం ఏమిటి? దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
ముంబై నగరంలో నిర్మించిన.. ముకేశ్ & నీతా అంబానీల కలల సౌధం సుమారు 27 అంతస్తులలో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ ఇళ్లలో ఒకటి కూడా. దీనిని లగ్జరీ, లేటెస్ట్ వాస్తుశిల్పానికి, భారతీయ సంప్రదాయానికి నెలవుగా నిర్మించుకున్నారు. ఈ లగ్జరీ భవనంలో.. 49 బెడ్ రూములు, ఐస్ క్రీం పార్లర్, గ్రాండ్ బాంకెట్ హాల్, ఒక స్నో రూమ్, ఒక ప్రైవేట్ థియేటర్, తొమ్మిది లిఫ్టులు, మూడు హెలిప్యాడ్లు, వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి కావలసిన ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి.
ప్రత్యేకమైన టెక్నాలజీ
ఇక ఔట్ డోర్ ఏసీ ఎందుకు లేదు? అనే విషయానికి వస్తే.. సాధారణ ఏసీ ఉపయోగించడం వల్ల, భవనం అందం తగ్గిపోతుందని.. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ కూలింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేకమైన టెక్నాలజీ ఉపయోగించినట్లు సమాచారం. ఇది భవనంలో పువ్వులు, ఇంటీరియర్, పాలరాతిని కాపాడుతుంది. యాంటిలియాలో ఎవరు అడుగుపెట్టినా.. ఉష్ణోగ్రతలో ఎలాంటి మార్పు ఉండదు. ఇక్కడ ఏసీ అనేది వ్యక్తిగత సౌకర్యం కోసం కాకుండా.. భవంతి నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసారు. కాబట్టి ఇక్కడ ఔట్ డోర్ ఏసీ కనిపించదు.
యాంటాలియా చల్లగా
ముంబై నగరం వేడిగా ఉన్నప్పటికీ.. యాంటాలియా మాత్రం చల్లగానే ఉంటుంది. ఒకసారి నటి శ్రేయా ధన్వంతరి ఫ్యాషన్ షూట్ కోసం కొన్నాళ్లు యాంటాలియాలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఒకరోజు, తనకు బాగా చలిగా అనిపించిందని, ఏసీ తగ్గించమంటే.. అక్కడి సిబ్బంది.. ఆ భవనం నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ ఏసీని తగ్గించకూడదని ఆమెకు వివరించినట్లు.. ఆమె తన అనుభవాన్ని వెల్లడించారు.
ఇదీ చదవండి: అలాంటి ప్రాజెక్టులు ఆపేయండి: మైక్రోసాఫ్ట్ ఏఐ చీఫ్


