బ్రాండ్‌ మారుతి.. విదేశాల్లో పెరిగిన డిమాండ్‌

Maruti Exported 2 Lakh Units To Foreign Countries - Sakshi

2021లో మారుతీ 2 లక్షల ఎగుమతులు

ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో ఇవే అత్యధికం  

ముంబై: దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది(2021)వాహన ఎగుమతుల్లో అరుదైన మైలురాయిని అందుకుంది. అన్ని విభాగాల్లో కలిపి కిందటేడాది మొత్తం 2.05 లక్షల యూనిట్లను విదేశాలకు పంపింది. ఒక క్యాలెండర్‌ ఏడాదిలో ఈ స్థాయి ఎగుమతులను సాధించడం ఇదే తొలిసారని కంపెనీ తెలిపింది. మారుతీ సుజుకీ 15 మోడళ్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తోంది. వీటిలో 2021 ఏడాదిలో బాలినో, డిజైర్, సిఫ్ట్, ఎస్‌–ప్రెస్సో, బ్రెజా మోడళ్లు టాప్‌–5 స్థానాలను దక్కించుకున్నాయి. ఈ కంపెనీ 1987లో తొలిసారి హంగేరీకి కార్లను పంపింది. ఈ 34 ఏళ్లలో మొత్తం 21.85 లక్షల కార్లను ఎగుమతి చేసింది. నాణ్యత, సాంకేతిక, భద్రత, డిజైన్, విషయంలో మారుతీ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నందునే రెండు లక్షల అమ్మకాల మైలురాయిని అందుకోగలిగామని కంపెనీ ఎండీ కెనిచి అయుకవా తెలిపారు.  

ఉత్పత్తి తగ్గింది 
వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ గత నెలలో మొత్తం 1,52,029 యూనిట్లు ఉత్పత్తి చేసింది. 2020 డిసెంబర్‌తో పోలిస్తే ఇది 2 శాతం తగ్గుదల అని కంపెనీ సోమవారం ప్రకటించింది. ప్యాసింజర్‌ వాహనాలు 1,53,475 నుంచి 1,48,767 యూనిట్లకు వచ్చి చేరాయి. ఆల్టో, ఎస్‌–ప్రెస్సో 27,772 నుంచి 19,396 యూనిట్లుగా ఉంది. కాంపాక్ట్‌ కార్స్‌ వేగన్‌–ఆర్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్‌ వాహనాల సంఖ్య 85,103 నుంచి 86,696 యూనిట్లకు పెరిగాయి. యుటిలిటీ వెహికిల్స్‌ జిప్సీ, ఎర్టిగా, ఎస్‌–క్రాస్, వితారా బ్రెజ్జా, ఎక్స్‌ఎల్‌6 వాహనాలు 28,006 నుంచి 31,794 యూనిట్లకు చేరుకున్నాయి. ఈకో వ్యాన్‌ ఉత్పత్తి 11,219 నుంచి 9,045 యూనిట్లుగా ఉంది. తేలికపాటి వాణిజ్య వాహనమైన సూపర్‌ క్యారీ తయారీ దాదాపు రెండింతలై 3,262 యూనిట్లకు ఎగిసింది.  

చదవండి: భారత మార్కెట్లలో కియా మోటార్స్‌ ప్రభంజనం..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top