కీలక మైలురాయి చేరిన ఇస్రో | ISRO Makes A Quantum Communication | Sakshi
Sakshi News home page

కీలక మైలురాయి చేరిన ఇస్రో

Mar 24 2021 10:32 AM | Updated on Mar 24 2021 2:05 PM

ISRO Makes A Quantum Communication - Sakshi

బెంగళూరు: కమ్యూనికేషన్‌ వ్యవస్థలో ఇస్రో మరో మైలురాయిని చేరింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తొలిసారిగా 300 మీటర్ల దూరంలో ఫ్రీ-స్పేస్ క్వాంటం కమ్యూనికేషన్‌ను విజయవంతంగా ప్రదర్శించిందని సోమవారం ఒక ప్రకటనలో  తెలిపింది. దీంతో క్వాంటం కమ్యూనికేషన్ రంగంలో గణనీయమైన కృషి చేసిన యూఎస్, యూకె, కెనడా, చైనా,  జపాన్ వంటి ఇతర దేశాల సరసన భారతదేశం చేరింది. సాంకేతికంగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించడంలో భారత్‌ మరోసారి తన సత్తా చాటింది. క్వాంటం టెక్నాలజీని ఉపయోగించి  ఉపగ్రహ డేటా లీక్‌ అవ్వకుండా సురక్షితంగా సమాచార వినిమయం జరపడంలో  ప్రధాన మైలురాయి అని ఇస్రో  తెలిపింది. స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి ఈ  ప్రయోగాన్ని విజయవంతం చేశారు. శాటిలైట్ బేస్డ్ క్వాంటం కమ్యూనికేషన్ (ఎస్బీక్యూసీ)ని ప్రదర్శించాలనే లక్ష్యంలో ఇస్రో  ప్రధాన పురోగతి సాధించింది.

అసలు ఏంటి ఈ క్యాంటం కమ్యూనికేషన్‌...?
సాధారణంగా మనందరికీ తెలిసే ఉంటుంది. రెండు వ్యవస్ధల మధ్య డేటా కమ్యూనికేషన్‌ కోసం ఒక నిర్ధిష్టమైన పౌనపున్యాన్ని(బాండ్‌) ఉపయోగిస్తారు. ఈ సమయంలో  మనం పంపించే డేటాలో ఏంతో కొంత లీక్‌ అవ్వవచ్చును. క్వాంటం కమ్యూనికేషన్స్లో క్వాంటం మెకానిక్స్ ఉపయోగించి సమాచార వినిమయం చేస్తారు. సమాచార వినిమయంలో భాగంగా రెండు వ్యవస్థల మధ్య డేటాను ట్విన్‌ ఫోటాన్‌ రూపంలో జరుపుతారు. ఈ విధంగా సమాచారాన్ని వినిమయం చేస్తే ఎలాంటి డేటా చౌర్యం జరగదు. క్వాంటం కీ- డిస్ట్రిబ్యూషన్ ఒక రహస్య కీని ఉత్పత్తి చేయడానికి, పంపిణీ చేయడానికి అనుమతిస్తుంది, ఇది సందేశాన్ని  ఎన్‌క్రీప్ట్‌, లేదా  డీక్రిప్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి చాలా కంపెనీలు పరిశోధనలు చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement